Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నవలలో ఊహాజనిత కల్పనలు లేవు. వాస్తవిక జీవిత చిత్రణే వుంది. తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంగా ఈ నవల కొనసాగింది. దీనిలో పల్లెటూరులోని జీవితం, వ్యవసాయ చిత్రణ వుంది. బతుకమ్మ, దీపావళి లాంటి పండుగలు, పెండ్లిళ్ళు వంటి ఆచారాలను ఈ నవలలో రచయిత్రి కన్నులకు కట్టినట్లు చిత్రించారు. తెలంగాణ పల్లె జనజీవన సంస్కృతి ఇందులో కనిపిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంఘ సంస్కరణల, జాతీయ భావనల కారణంగా తెలంగాణ పల్లె జీవన విధానంలో మార్పులు వచ్చాయి. కులభేదాలు, వర్గభేదాలు, అంటరానితనం వున్న సమాజంలో యువకుల మూలంగా మార్పులు వస్తాయి. ఒకే కులంలో బీద, ధనిక భేదాల్ని పాటించే వారిలో అందరూ సమానమనే భావనలు మొదలవుతాయి. అలాంటి వాతావరణాన్ని రచయిత్రి ఈ నవలలో చిత్రీకరించారు. ఒకే కులానికి చెందిన రెండు కుటుంబాల మధ్య భేదాలు ఏర్పడతాయి. ఆ భేదాలు పోయి ఆ కుటుంబాల మధ్య సంబంధాలు నెలకొనే దాకా జరిగిన పరిణామాలే ఈ నవల కథావస్తువు. కథానాయకుడైన వెంకటరెడ్డి ధనికుడైన సుబ్బారెడ్డి కూతురు పార్వతిని ప్రేమిస్తాడు. వారిద్దరూ పట్నం వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇద్దరి కుటుంబాలు వారిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వవు. బీదవారి సహాయంతో వారిద్దరూ గుడిసె వేసుకుని వుంటారు. వెంకటరెడ్డి కూలిపని చేస్తుంటాడు. అతని తండ్రి రాంరెడ్డి డబ్బుకాశపడి తన కుమార్తె రాములును ముసలివాడైన కోటిరెడ్డిని ఇచ్చి పెళ్ళి చేస్తాడు. తన చెల్లెలికి విడాకులిప్పించి, వెంకటరెడ్డి ఆమెకు మరో పెళ్ళి చేస్తాడు. అతను గ్రామ సర్పంచ్ అవుతాడు. తమ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఈ నవలలో సుబ్బారెడ్డి, రాంరెడ్డి, కోటిరెడ్డి పాతతరం ప్రతినిధులు కాగా, వెంకటరెడ్డి, పార్వతి కొత్తతరం ప్రతినిధులు. ఈ నవలంతా తెలంగాణ పల్లెల్లోని వాడుక భాషలో వుంది.
తరం మారింది (నవల), రచన : మాదిరెడ్డి సులోచన, వెల : 60/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491