Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి కనబడే నిజాల వెనక చోదక శక్తుల చలనాలు ఉంటాయి. అవి సుఖాలు, దు:ఖాలు, పోరాటాలు, రాజీపడటాలు ఇంకా మరేమైనా కావచ్చు. వాటిని చిత్రించడమే కథ ముఖ్య ఉద్దేశ్యం. ఒక్కో కథకుడు ఒక్కో విషయానికి ప్రాధాన్యత ఇస్తాడు. డా|| వెల్దండి శ్రీధర్ జీవితం వెనక ఉన్న విషాద సన్నివేశాలను బహిర్గతం చేసిండు 'పుంజీతం' అనే కథా సంపుటి ద్వారా. పన్నెండు కథల్లో విషాదాన్ని చిత్రించిండు. రైతు ఆత్మహత్యలు, చేనేత చావులు, ఆకలి చావులు, ప్రేమచావులు, వడ్డీ కోరలకు చిక్కిన బతుకులు, స్వీయహననం, కుల రక్కసి కరాళ నృత్యం, చితికిన బతుకులు, దయనీయత, ఎయిడ్స్ విషం, తెలంగాణ చేదు వాస్తవాల్ని కథలుగా మలిచాడు. కథనంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల అవి చదివించేవిగా ఉన్నాయి. కథల్లోని పాటలు, నాటకీయత అందుకు దోహదం చేశాయి. ఖండికలుగా, వర్తులాలుగా కథలను చెప్పడం వల్ల పఠనీయత పెరిగింది. ఒకే రోజు ఒకే చోట జరిగిన మూడు ఆత్మహత్యల్ని దృశ్యీకరించడం, పది జిల్లాల వేదనల్ని, నాలుగు కోట్ల పిడికిళ్లతో అనుసంధించటం అనేవి కథకుడిగా శ్రీధర్ నైపుణ్యాన్ని చూపెడుతాయి.
ఈ కథల ద్వారా ప్రపంచీకరణ గుట్టు తెలుస్తుంది. ప్రపంచీకరణ అనేది ఒక అంతర్జాతీయ పరిణామం. రాజకీయం దాన్ని ఎటు వైపు తీసుకెళ్తుంది. అనేది ప్రధాన ప్రశ్న. వ్యక్తిగతం కూడా సామాజికమే. ప్రపంచీకరణ ఒక సామాజికాంశం. అందువల్లనే అది మన పడక గదిలోకి కూడా ప్రవేశించగలుగుతుంది. వ్యక్తి మానసిక వైఖరిని నియంత్రించడంలోను, విశృంఖలతను ప్రోత్సహించడంలోను, ప్రపంచీకరణను నడిపే రాజకీయ భావజాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. 'అమృతవర్షిణి' కథలో నిమిష విశృంఖలతకు, స్థిమిత వ్యక్తిత్వానికి, స్వామీజీ చెప్పిన ఆత్మతత్వానికి ఆలంబనగా నిలిచేది రాజకీయ ప్రేరేపిత ప్రపంచీకరణ. రచయిత దాన్ని మామూలు అర్థంలో 'అవసరం' అని వాడినాడు. కనుకనే నిజమే ''స్త్రీ, పురుషునికి ఆలంబన అవుతుంది. అమృతం అవుతుంది. 'అవసరం' అనేది ఒక రేఖ మాత్రమే అనుకొని మెల్లగా మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు'' అని మధ్యేమార్గంలో కథను ముగించాడు.
హైస్పీడ్ యుగం ఇది. ఫైఓవర్ పై నుండి కార్లు కిందికి దూకుతున్న కాలం ఇది. కారు లోపల, కారు కింద పడిన వారి జీవితాలు కుంటి గుర్రాలవుతున్న విషయం చూస్తున్నం. ఇదంతా బయటికి కనిపించేది. మరి మనుషుల లోపలి విధ్వంసం సంగతేంటి? బయట జరుగుతున్న పరిణామాలు మనుషులను పరిగెత్తిస్తున్నవి. పోటీ వల్ల, స్వార్థం వల్ల మనిషి శారీరక, మానసిక పతనానికి చేరువవుతున్నడు ఈ విషయాన్ని 'లోలోపలి విధ్వంసం' కథ చక్కగా చిత్రించింది. ప్రేమ వ్యవహారాలు ఎన్ని కోణాల్లో బయట పడుతవో తెలియడం లేదు. త్యాగం పునాదిగా విలసిల్లాల్సిన ప్రేమ, స్వార్థపు పునాదులపై నిలిచి ఎన్ని విపరీతాలు పోతుందో అర్థం కాకుండా ఉంది. రచయితల ఊహలకు కూడా అందకుండా ప్రేమ వ్యవహారాలుంటున్నవి. అలాంటి పోకడలను అక్షరబద్దం చేసిన కథ 'దడ్వత్'. ఇలాంటి ప్రేమ వ్యవహారానికి ఎక్స్టెన్షన్గా 'పుండు' అనే కథ కనిపిస్తుంది. తల్లిదండ్రులకు సంతానం ఎట్లనో, రైతుకు పండించే పొలం అట్లాంటిది. ఎదిగొచ్చిన సంతానం, చేతికందిన పంట రెండూ మనిషికి కొండంత బలాన్నిస్తాయి. ఈ రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకుంటే అవి అతని పాలిటి ఆశనిపాతాలవుతాయి. 'సజీవదహనం' కథ ఈ విషయాన్ని విశదీకరిస్తుంది. సంక్షేమ పథకాల పేరున ప్రభుత్వాలు ఉచితంగా అనేకం అందిస్తున్నాయి. పేద ప్రజలు ఈ పథకాల లబ్దిదారులుగా ఉంటే కొంత వరకు సమంజసం. అందుకు విరుద్ధంగా పథకాల ఫలితాలు కొందరు ఉన్నవారికే అందుతున్నవి. కొంతమంది లేనివారికి మొండి చెయ్యే మిగులుతున్నది. ఇది ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకమైనది. ఆచరణలోని లోపమిది. దీని పర్యవసానం ఆకలిచావులు. 'ఆరుద్రపురుగులు' అనే కథ ఈ విషయాన్ని తెలుపుతుంది.
కథలో కల్పన తప్పదు. వాస్తవాధీన కల్పనలు శోభను కూర్చుతాయి. అందుకు విరుద్ధమైనవి మసకబారుస్తాయి. 'పుంజీతం' లాంటివి ఒకటి రెండు కథలు మసక మసకగా కనిపిస్తాయి. భిన్న జీవిత కథల్ని ఒక చోట చేర్చి సంకలించడం వల్ల తాజాదనాన్ని అనుభూతి చెందుతాం. తెలంగాణ భాషా సొగసు, వ్యవహారిక భాషా సౌరభం కథలకు పరిమళాన్ని అద్దాయి. పాత్రోచిత భాషా శైలి కథల్ని సారవంతం చేశాయి. తెలంగాణ కథా వేదికపై శ్రీధర్ సరికొత్త సంతకం నమోదైంది.
- డా|| బి.వి.యన్.స్వామి,
9247817732