Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాకవి గోరటివెంకన్న తనదైన తాత్విక ధోరణితో ''వినకపోతివి గదరా ఎరుక గలిగిన పదం'' అంటూ తనదైన శైలిలో పాటై ప్రవహిం చాడు. ఇందులో వెంకన్న మళ్లీ మనిషి తన మూలాలోకి వెళ్లాలంటూ...'' చిరునవ్వు లొలికేటి సిరులకుదరు పల్లె/ తల్లి ఒడికి మళ్లీ బాట పట్టితే మేలు'' అంటూ సూచిస్తాడు.
కరోనా పాటల్లో రచయితలందరిది ఒకే దృష్టి. అది సర్వమానవాళి శ్రేయస్సు దృష్టి. ఈ విపత్తు నుండి మానవజాతిని కాపాడు కోవడానికి ప్రతీ ఒక్కరూ తమ యిళ్లలో ఉండడమే ఇప్పుడు అతిపెద్ద ఉద్యమమని చెప్పకనే చెప్పినట్టయ్యింది.
ప్రజాకవుల లోగిలి తెలుగు నేల. ప్రజలను సమస్యలు చుట్టుముట్టే వేళ ఆ కలాలు కవాతు చేస్తాయి. కష్టజీవికి ఇరువైపులా కాపలా కాస్తాయి. సామాన్యునికి తమ మద్ధతును తెలిపి కొండంత అండను అందిస్తాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కూడా ప్రజాకవులు పాటకవులై తమ పాటలతో కరోనాపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఒక భరోసాను పాటరూపంలో అందించారు. సామాన్యులను అలరించేదైనా, ఆలోచింపజేసేదైనా పాటే. ఆయా పోరాటాల్లో పదునైన పాటలు వచ్చినట్టే, ఇవాళ కరోనా మీద కూడా ఆలోచనాత్మక పాటలు వచ్చాయి.
సాధారణంగా ప్రజా గీతాలన్నీ ప్రజా సమస్య లను ఏకరువు పెట్టేవే. రైతుల కన్నీరు గురించో, కార్మికుల కష్టాలను గురించో రాయకుండా ఏ ఉద్యమం ముందుకు సాగలేదు. ముఖ్యంగా కరువు, తుఫాను వంటి ప్రకృతి విపత్తుల కాలం లో పాటకవులు పాట లతో ప్రజాపక్షం నిలి చారు. ఇక వలసలు, ఆకలి చావుల సందర్భంలో కూడా పాటే భుజం తట్టింది. ఇలాంటి పాటల చరిత్ర ఇవాళ కొత్త పుంతలు తొక్కుతున్నది. గడిచిన నెలరోజుల్లో కరోనాపైన వందకు పైగా పాటలొచ్చాయంటే అతిశ యోక్తి కాదు. పెరిగిన శాస్త్ర సాంకేతికతను పాట సరిగా ఉపయోగించుకుంటున్నది. సామాజిక మాధ్యమాల ద్వారా పాటకు ప్రచార సౌలభ్యత చేకూరుతున్నది. అలాగే ఒక పాటకు సంగీతం సమకూర్చుకోవడం గతం లో కంటే ఇవాళ సులభతరమైంది. దీంతో కొత్త రచయి తలు పుట్టుకొస్తున్నారు. ప్రతీ జీవన సందర్భాన్ని పాటగా మలిచి మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై వచ్చిన పాటలను కొన్ని ప్రధాన భావనలుగా విభజించవచ్చు.
1.కరోనా తీవ్రతను వివరించే పాటలు:
కరోనా నేపథ్యంలో చాలా మంది పాటకవులు మరోసారి ప్రకృతి ఆవశ్యకతను వివరించారు. మనిషి విపరీత పోకడల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తు న్నాయంటూ పాటై పోటెత్తారు. ప్రజాకవి గోరటివెంకన్న తనదైన తాత్విక ధోరణితో ''వినకపోతివి గదరా ఎరుక గలిగిన పదం'' అంటూ తనదైన శైలిలో పాటై ప్రవహిం చాడు. ఇందులో వెంకన్న మళ్లీ మనిషి తన మూలాలోకి వెళ్లాలంటూ...'' చిరునవ్వులొలికేటి సిరులకుదరు పల్లె/ తల్లి ఒడికి మళ్లీ బాట పట్టితే మేలు'' అంటూ సూచిస్తాడు. అలాగే ''ఎగువ తిరుమల దిగువ తిరుమల నీలోనే/వెలుగొందుచున్నవి యాత్రలేల/ కనుపాపలో మక్క అజ్మీరులున్నవి/జమయతులు ఎందులకు జపము జాలు/గాటి ఎద్దువోలే మతిని గుంజికట్టు/కాసే పున్నమి కాంతి నీలోపలనే పుట్టు'' అంటూ మనిషిని అసలైన దేవుడు నీలోనే ఉన్నాడు వేరే పుణ్యక్షేత్రములెందుకు అని ప్రశ్నించాడు. ఇక ప్రకృతికవి జయరాజు''ప్రకృతికి ప్రణమిల్లే తరుణమిది/నీపై నువు చేసే యుద్ధమిది/కాలం గతితప్పిన ఫలితమిది/ కరోనలాంటి వ్యాధులెన్నో మరి/ప్రాణాలనే అరిచేతిలో పట్టుకొని/ ప్రపంచమే వణుకుతోంది చూడు మరి'' అంటూ మానవ జాతి తప్పిదాలను గుర్తు చేశాడు. ప్రకృతిని నిర్లక్షం చేసిన ఫలితమే ఇది అని హెచ్చరించాడు.
బహుజన వాగ్గేయకారుడు డా.ఏపూరి సోమన్న ''యాడి నుంచి వచ్చిందిరో కరోనా/మనమెట్ల బతకాలిరో'' అంటూ కరోనా వల్ల జరుగుతున్న జీవన విధ్వంసాన్ని ఆవేదనాత్మకంగా వర్ణించాడు. ఇక సినీ రచయిత డా.కందికొండ ''తెలంగాణ నేల మీద వేసేయ్యి ఒట్టు/ కరోనాను తరిమి కొట్టు/గుండెల్లోనో కరెంటు అందించే పట్టు/మహమ్మారిని మట్టుపెట్టు''అంటూ కరోనాను కట్టడి చేయాలంటూ సూచించాడు. ఈ పాటలోనే డా.కందికొండ అందరూ అంటున్న సామాజిక దూరం అనే మాటను భౌతికదూరమని వాడి పాలకులను మించిన సామాజిక అవగాహనను వ్యక్తం చేశాడు. ''కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తం/మా భారత
భూభాగానా/ కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తం/ నూట ముప్పయి కోట్ల జనం సరేనా'' అంటూ సీనియర్ వాగ్గేయకారుడు 'నిసార్' కరో నాపై ప్రతిఘటనా యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. కరోనా కాలంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలను ఈ పాట గుర్తు చేసింది. ఇక మరో వాగ్గేయకారుడు యశ్పాల్ ''సోషల్ మీడియా వదంతులు నమ్మకురా/ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మంచిదిరా''అంటూ జాగ్రత్తలు చెప్పు కొచ్చాడు. మూడు దశాబ్దాల వామపక్ష చైతన్య కేతనం సాంబరాజు యాదగిరి కరోనాకు కారణాలు వెతుకుతూ... ''భూమంతా నాదేనని/సర్వస్వం నేనేననే/ మానవ అహంకారాన్ని కూల్చుతున్నది/తరాల విధ్వంస్వం తిరుగబడుతున్నది''అని మానవ తప్పిందాలను గుర్తు చేశాడు. ఇక యువ వాగ్గేయకారుడు మాట్ల తిరుపతి ''మందు లేని రోగమో/ ఇది మంది ఎంట పడ్డదో''అంటూ జనం గోసను పాటకట్టి పాడాడు. ఇక అమ్మపాటతో రెండు ఖండాంతరాలకు విస్తరించిన పత్తిపల్లి తిరుపతి ''కనివిని ఎరుగని కల్లోలం/కరోనాతో వణుకుతున్నది భూగోళం''అంటూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశాడు. కరోనా సందర్భంగా తిరుపతి సుమారు ఏడు పాటలు రాశాడు.
2.శుభ్రతను నొక్కి చెప్పే పాటలు:
కరోనా వైరస్ అంటువ్యాధిలా వ్యాపించి ప్రపంచాన్ని కబళించింది. ఈ పెను ప్రమాదం మీద వాగ్గేయకారులు తమదైన ముద్రతో పాటలు అల్లి జాగరుకతను గుర్తు చేశారు. శుభ్రత అనేది ముఖ్యమైన విషయమని తమ పాటల్లో పలువురు పాటకవులు బోధించారు. వారిలో సంగీత దర్శకులు బోలే మంచి పాట రాసి పాడాడు.
''అనుకోని వైరసొచ్చె తమ్ముడో/నువ్వు ఆనుకోని తిరుగకురా తమ్ముడా/విడగొట్టిన రోగమిది తమ్ముడో/ దాన్ని పగబట్టి సంపాలె తమ్ముడా'' అంటూ ఒగ్గుకథ బాణీలో అలరించాడు. అలాగే మరో ఉద్యమ వాగ్గేయ కారుడు అభినయ శ్రీనివాస్ ''చేయిచేయి కలిపినడవని వినూత్నపోరాటం/ఇది ఎవరికివారై ప్రకటించిన యుద్ధం'' అంటూ ఈ ఉద్యమం ఎలా భిన్నమైందో ఎరుక చేశాడు.
3.లాక్ డౌన్ను పాటించాలనే పాటలు:
స్వీయ నియంత్రణ ద్వార మాత్రమే కరోనాను కట్టడి చేయగలమనే భావనను ఎక్కువమంది రచయితలు తమ పాటల్లో చెప్పుకొచ్చారు. అది కూడా భిన్నరకాలుగా కొన సాగింది. ''చేతులెత్తి మొక్కుతా చేయి బయట పెట్టకురా/ కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా/ ఉన్న కాడె ఉండరా గంజి తాగి పండరా/ మంచి రోజులొచ్చె దాకా నిమ్మలంగ ఉండరా'' అంటూ సాగే ఈ పాటను ఇటీవల యూత్ను ఎక్కువగా ఆకట్టుకుంటున్న చౌరస్తా బ్యాండ్ నుండి వచ్చింది. లాక్ డౌన్ ప్రాము ఖ్యతను నొక్కిచెప్పిన పాట ఇది. ఇంటి నుండి బయటకు రావద్దనే విషయాన్ని చెబుతూ చేతులెత్తి మొక్కుతా, కాళ్లు కూడా మొక్కుతా అనడం ప్రాధేయ పూర్వక పిలు పుకు సంకేతంగా నిలిచింది. రోటీన్ ట్యూన్ లకు భిన్నంగా ర్యాప్, పాప్ను మిక్స్ చేసే ఈ బ్యాండ్ ప్రయోగం, ప్రస్తుత సామాజిక సందర్భాన్ని కూడా పాటగా మలచడం బాగా కుదిరింది. ''నువ్వు అడిగే బెట్టకు బయట/ వస్తే చస్తవు బేటా/ఇది కరోనా భారు జెర డరోనా'' అంటూ లాక్డౌన్ ఎంత అవసరమో వివరించాడు బొర రామ్రెడ్డి అనే కవిగాయకుడు. ఇక వాగ్గేయ కారుడు యోచన ''కత్తి పట్టకుండనే నెత్తురంటకుండనే కుత్తుకలు కోసే యుద్ధమొచ్చి నాదిరా /కాలుబయట పెట్టినా చేయి చేయి కలిపినా కాటికి పంపే కాలమొచ్చినాదిరా'' అంటూ జనానికి లాక్డౌన్ తీవ్రతను వర్ణించాడు. తనదైన ముద్రతో పాటలు రాస్తున్న కలం చరణ్ అర్జున్. భిన్న సామాజిక సమస్యలను వస్తువులుగా తీసుకోని సినిమా శైలి బాణీలతో మంచి పాటలను రూపొందించిన తాను కరోనా సందర్భంగా కూడా ''ఉండలేవా నువ్వ ఇంట్ల ఉండలేవా''అంటూ తాత్వికంగా ప్రశ్నించాడు.
4.వలసకూలీల దుస్థితిని ఎలుగెత్తిన పాటలు:
కరోనాతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితం చిధ్రమైంది. ముఖ్యంగా వలస కార్మికులకైతే తీరని దు:ఖాన్ని మిగిల్చింది. ఈ పరిణామాన్ని కూడా కరోనా పాట పట్టుకోగలిగింది. ''దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే/ మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్నుబోసే'' అంటూ ఆదేశ్ రవి రాసిన ఈ పాట కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథను అక్షరాలకు ఎత్తింది. ఈ పాటలో ఉప యోగించిన పదాలు పల్లె తెలంగాణ జనజీవితంలో సజీవంగా ఉన్నవి. అత్యంత విషాద రాగంతో అల్లిన ఈ పాట ఎక్కువగా వైరల్ అయ్యింది. చాలా చిన్నపాటే అయినా ఎక్కువ ప్రభావాన్ని చూపింది. సామాన్యుల బతుకు చిత్రం ఎంతటి విషా దంగా ఉందో కళ్ల ముందుంచింది. ప్రజల భాషలో, ప్రజల బాణీలో ప్రజలగోసను పాట అల్లిన తీరు అత్యంత హృద్యంగా ఒదిగింది. ఈ పాటలో రచయిత ''పేదరోగం కంటే పెద్ద రోగముందా?!'' అనే మాట యావత్ మానవజాతి సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నది.
5.త్యాగాలను కీర్తించే పాటలు:
''చెత్త ఎత్తే చేతులకు చేతులెత్తి మొక్కుదాం/ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను తాకుదాం'' అంటూ వరంగల్ జర్నలిస్టు కేకే రాసిన పాట ఇది. కరోనా సందర్భంలో వైద్యుల, పోలీసుల త్యాగాలను ఎక్కువగా కీర్తించారు. ఇదే సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య రంగంలో కష్టిస్తున్న కార్మికుల శ్రమను గుర్తించాడు ఈ పాట రచయిత. ఇక నక్క సురేష్ అనే యువకలం ''అన్నా కరెంటన్నా...మాయన్న కరెంటన్నా'' అంటూ కరోనా కాలంలో కరెంటు కార్మికుల త్యాగాలను పాటగట్టాడు. ''దేశాన్నే శుభ్రం చేసే దేవుండ్లే మీరు ఓయన్నా సఫాయి అన్న/మీ పాదాలే కడిగిన మీ రుణమే తీరేనా''అంటూ చరణ్ అర్జున్ రాసిన పాటను నల్గొండ గద్దర్ నర్సన్న కరోనాకాలంలో సఫాయి కార్మికుల త్యాగాలకు దండాలు పెడుతూ పాడాడు.
ఎలాంటి విపత్తు సంభంవించిన వాగ్గేయకారుడు చేయాల్సిన పని రేపటిపైన భరోసాను కలిగించడం. ఈ పనిని తమ శక్తిమేరకు చేసి చూపించారు కవులు, కళాకారులు. బతికుంటే బలుసాకు తిని బతుకుదామనే ప్రజల నానుడి పలువురు రచయితలకు గుర్తుకు వచ్చింది. దాన్ని పాటలో పైలంగా ఒదిగించారు. ''పైసపోతే పోనీయిగానీ, పాణముంటే సాలన్న/బలుసాకైనా తిందాంగానీ, బతికి ఉంటే సాలన్న/మన పుట్టుకలోనే
ఉన్నదిరన్నా కొట్లాడే గుణము/నాడు గత్తరొస్తే సంపినెత్తిన ఎత్తినాము మనము/మన బతుకులోనే దాగున్నదన్న తండ్లాడే తనము/నేడు కొత్తగొచ్చిన కొమ్ముల పురుగుకు పెడదాము దినము/మల్ల ఎత్తుదాము బోనమూ'' అని సినీ కవి కాసర్ల శ్యామ్ రాసిన పాట గొప్ప భరోసాను కరోనా నేపథ్యంలో ప్రజలకు అందిస్తున్నది. జానపద బాణీలో ఉరకలెత్తించే సినిమా పాటలు రాసిన కాసర్ల ఈ సారి, కరోనా మీద ఆలోచనాత్మక పాటై ప్రవహించాడు.
అలాగే వినూతనమైన కళాకారుడైన పోలీస్ ఆఫీసర్ నాగమల్లు ఒగ్గుకథ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇందులో కూడా సంవాద ధోరణిలో అనేకపాటలు కరోనాపైనా, దాని దుష్పలితాలపైన అల్లిన తీరు ఆకట్టుకుంది. కరోనా విపత్తు వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అవుతున్నాయంటారు ఆచార్య పిల్లలమర్రి రాములు.
పై విభజనలో ఇమ డని పాటలు రాసిన రచ యితలు కూడా లేకపో లేదు. కరోనా అంశాన్ని భిన్న దృష్టికోణంతో రాసిన రచ యితలు కూడా కొందరు న్నారు. వారిలో షాన్రెం జర్ల రాజేష్, రాచకొండ రమేష్, మేడికొండ ప్రసాద్ లు. బహుజన వాగ్గేయ కారుడు రెంజర్ల రాజేష్ ''సకల శాస్త్రాలు బూటకమంటూ గుట్టు విప్పేసినావు/మీ దేవుని శక్తి ఉత్తదేనంటూ తెరలు తొలగించినావు'' అంటాడు. ఇట్లా ఆదూరి వెంకటరత్నం, సైదులు, నెల్లుట్ల సుమన్, తాళ్ల సునీల్, సారంగపాణి, మాసాయిపేట యాదగిరి, మిట్టపల్లి సురేందర్, మచ్చా దేవేందర్లు కరోనా నేపథ్యంలో మంచి పాటలు రాశారు. సాయిచంద్, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, బోడ చంద్రప్రకాశ్, ఎర్రమల్లి తదితరులు పాటలతో ప్రజలకు అండగా నిలిచారు. కష్టకాలంలో ఒక పాటసాయం చేశారు. ''కానికాలమొచ్చెనంటూ కన్నీరు పెట్టబోకమ్మా'' అంటూ పసునూరి రాసిన పాటలో ''అమాస ఎల్లిపోయి పున్నమొచ్చినట్టు...చీకటెల్లిపోయి వెలుగురాకుంటదా'' అన్నట్టు భవిష్యత్పైన ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. ఇట్లా కరోనా పాటల్లో రచయితలందరిది ఒకే దృష్టి. అది సర్వమానవాళి శ్రేయస్సు దృష్టి. ఈ విపత్తు నుండి మానవజాతిని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ తమ యిళ్లలో ఉండడమే ఇప్పుడు అతిపెద్ద ఉద్యమమని చెప్పకనే చెప్పినట్టయ్యింది.
ఇక్కడ పేర్కొన్న పాటలు కొన్నే. ప్రస్తావించిన రచయితలు కొందరే. స్థలాభావం వల్ల పేర్కొనని పాటలే ఎక్కువ. ప్రజల గుండె చప్పుడై ప్రతిధ్వనించి, కరోనా సమరంలో పాటలు రచించిన రచయితలందరికీ జేజేలు.
- డాక్టర్ పసునూరి రవీందర్, 7702648825