Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్నా! పెద్దబాడిశెతో
తుమ్మమొద్దు చెక్కి చెక్కి
మొద్దుబారిన నీ చేతులు
మాకింత ముద్దపెట్టాలని
ఎంతగా తపించేవి (దాతికాడ-పే.53)
ఇప్పుడొస్తున్న కవిత్వం జీవితమూలాల్లోంచి,ప్రజల కన్నీళ్ళలోంచి, అనేక సంఘర్షణలలోంచి వస్తుంది. ప్రతీఒక్కరు తమతమ అస్తిత్వాలను చాటుకుంటున్న అపురూప సందర్భమిది. ఇటువంటి సందర్భంలో నాన్న శ్రమను, వడ్రంగి జీవితాన్ని, వడ్రంగి జీవితంతో ముడిపడ్డ అనేక బహుజన జీవితాలను ''బతుకుచెట్టు'' కవిత్వంగా తెచ్చినకవి వెన్నెలసత్యం. ఇది వరకు నానీలు, మణిపూసలు మొదలైన మినీ కవితా రూపాలలో వర్తమాన సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద గొంతెత్తాడు. బతుకుచెట్టు వచనకవిత్వంతో మానవీయ పరిమళాలను వెదజల్లుతూ బంధాలకు వంతెన కడుతున్నాడు. వస్తు వైవిధ్యాన్ని తెలిపే కవితలు, స్త్రీ కేంద్రంగా ఉన్న కవితలున్నా ఎక్కువ భాగం కవితలు బహుజన జీవితాన్ని పట్టించేవే. ముఖ్యంగ వడ్రంగి, కమ్మరి బతుకును చిత్రించిన కవితలు.
''బండిపయ్యల మీద
లతలై అల్లుకున్న
పువ్వులై పూసిన ఆ వడ్రంగితనం
అందరిని అబ్బురపరిచేది''
వ్యవసాయానికి ఆధారమైన నాగళ్ళను, ఎడ్లబండిని తయారు చేసే వడ్రంగి శ్రమ, కళానైపుణ్యం ఎంత గొప్పదో ఈ వాక్యాలలో తెలుస్తుంది. తలుపుల మీద, దర్వాజల మీద, బండి చక్రాల మీద ఎన్నో అందమైన డిజైన్లను సష్టించే వడ్రంగి జీవితం ఇపుడు అంతే అందంగా ఉందా? అంటే లేదనే చెప్పాలి. మనం చెప్పుకుంటున్న అభివద్దిలో వాళ్ళు ఎక్కడ ఉన్నరో, వాళ్ళ జీవితాలెలా చితికి పోయావో బతుకుచెట్టు చెబుతుంది.
''ఆ బండిపయ్యలు
ప్రగతిచక్రాలై పరుగులు పెట్టినా
వడ్ల,కమ్మరోని బతుకుమాత్రం
వెనక్కి తిరుగుతూనే ఉంది''
ప్రపంచీకరణ ప్రభావం ముఖ్యంగ అనేక కులవత్తుల మీద పడింది.వలసలు మొదలై పల్లెల్లో పాడువడ్డ గోడలు మిగిలాయి. వడ్రంగి లాంటి జీవితపు వాకిళ్ళన్ని పొక్కిలైనవి. వడ్రంగి జీవితంలోని పనితనమేగాక, వాళ్ళ బతుకులోని విషాదాన్ని పట్టిస్తాయి వెన్నెల సత్యం కవితలు.
1)ఈతచెట్టు కార్మికుడి
బతుకుచెట్టయి నిలబడుతుంది (బతుకుచెట్టు-పే.26)
2)కఠినమైన ఇనుము సైతం
నాన్న చెప్పినట్లు వంపులు తిరిగేది (పే.32)
3)నాన్న చేసిన కమ్మలకత్తితోనే
ఆ గొల్లమల్లయ్య తన మూగజీవాలకు
వేపాకు తుమ్మగజ్జల్ని
కడుపారా తినిపించింది (పనిముట్టు-పే.78)
పై వాక్యాలన్నింటిలోనూ బహుజనజీవితం కనబడు తుంది. తాటి, ఈత చెట్లపై ఆధారపడి బతుకును పూయించు కునే గౌడజీవితం, ఇనుమును కాల్చి కొడవండ్లు, కత్తులు తయారు చేసే కమ్మరి శ్రమ, కమ్మరి తయారు చేసే కమ్మల కత్తిని మేకల కోసం వాడే యాదవ జీవితం తనకు తెలుపుతాయి. వీటిల్లో బహుజన దక్పథం, శ్రమతత్వం స్పష్టంగా అర్థమౌతాయి. వెన్నెలసత్యం కవితల్లో ''పనిముట్టు'' కవితకు ప్రత్యేక స్థానముంది.
''సకలజనులకూ సద్వినియోగం కావాలనే కదా
నాన్న కత్తికి పనిముట్టు హౌదా ఇచ్చింది''
(పనిముట్టు-పే.78)
గొడ్డలి, కొడవలి, కత్తి మొదలైన వాటిని ఆయుధాలుగా కాక పనిముట్టుగా వాడడంలో నిజమైన బహుజన దక్పథం కనబడుతుంది. ఏఏ కులాల వాళ్ళు ఎలా పనిముట్లుగా వాడుతున్నారో చెప్పి ముగింపులో ఇప్పుడు జరుగుతున్న హత్యలగురించి చెబుతాడు.
''మరిప్పుడు ఆ కత్తి
పనికిమాలిన హంతకుల చేతుల్లో
తలలు నరికే ఆయుధమైనందుకు
తనను తాను నిందించుకుంటోంది''
దేనినైనా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టే ఉంటుంది.
పరువు హత్యలను, సామాన్యుల మీద దాడులను, వీధుల్లో రౌడీయిజంలను మొదలైన ఎన్నింటినో నిరసించడంలో కవిగా తన సామాజిక బాధ్యత ఎలాంటిదో తెలుస్తుంది.
బతుకుచెట్టులో కర్ఛీఫ్, నులక మంచం, ఎడ్లబండి, నాన్న జేబు, మొదలైన కవితలు వస్తువైవిధ్యాన్ని తెలియజేస్తాయి.
''పచ్చిబాలింత అమ్మకూ
పసికందునైన నాకూ
నులివెచ్చని కౌగిలినిచ్చింది
ఆ నులకమంచమే''(నులకమంచం-పు.59)
ఆయా వస్తువుల మీద రాసిన కవితల్లో ''నాస్టాల్జియా'' కనబడుతుంది. ఆ వస్తువు మనిషి జీవితంలో ఎలా భాగమైందో చెబుతూ దానిపట్ల ప్రేమను వ్యక్తం చేస్తాడు.
వెన్నెలసత్యం కవితల్లో వైయుక్తిక స్పహ ఎక్కువగా కనబడుతుంది. ''వైయుక్తిక స్పహ తన తోడు వచ్చే వాటిని, మార్గ నిర్దేశనం చేసే అంశాలను, వ్యక్తులను కవిత్వం చేశారు (ఎం.నారాయణశర్మ-వ్యక్తీకరణ కవిత్వ విశ్లేషణ వ్యాసాలు)
వెన్నెల సత్యం కూడా తన జీవితానికి మార్గదర్శకులైన అమ్మనాన్నలను, అమ్మమ్మను, ప్రేమను పంచిన చెల్లిని, భార్యను కవిత్వం చేశారు. వారి పట్ల తనకున్న ఆత్మీయత, గౌరవం కనబడుతుంది. మానవ సంబంధాలు లుప్తమై పోతున్న కాలంలో వీటిని చదువుకోవడం అంటే మళ్ళి మనలోని ప్రేమల్ని తట్టిలేపడం.
వెన్నెలసత్యం కవితల్లో అధిక్షేపం ఎక్కువగా కనబడు తుంది. ప్రభుత్వాల పనితీరును, ప్రజల కష్టాలను పట్టించు కోకుండా ప్రభుత్వాలకు వంతపాడే కవులను విమర్శించడంలో వ్యంగ్య ధోరణి ఎక్కువ కనబడుతుంది.
1)కలానికి కళ్ళు
బాగా నెత్తికెక్కినట్లున్నయి
కాగితం మీద
ఆకలిగీతాలు పాడనంటుంది(పే.48)
2)ముఖపుస్తకంలో తలమునకలై
ముఖాలు చూసుకోవడమే
మానేసిన నిస్సహాయులం
చెప్పేవారే గాని
వినేవారు లేని వింతలోకమిది(పే.52)
ఫేస్ బుక్, వాట్సప్ మాధ్యమాలలో ఉండే లొసుగుల్ని, వాటి వల్ల వచ్చే అనర్థాలను చెప్పిన ఈ వాక్యాలలో అద్భుతమైన వ్యంగ్యం ధ్వనిస్తుంది. లైకులు, కామెంట్లలో పడి ఆధునిక జీవితం ఎంత యాంత్రికమైందో చెప్పడంలో కూడా ఈ అధిక్షేప లక్షణం కవితలకు బలాన్నిచ్చింది.
1)రోగమయ బతుకుల నిండా
ఆరోగ్యవెన్నెల కురిపించే
నల్లనిచందమామలా
ఆ పెంకు అనుక్షణం
నా కళ్ళముందు కదలాడుతుంది.
2)మండే సూర్యున్ని చుట్టూరా
కత్తిరించితెచ్చారా అన్నట్లుండే
ఎర్రగా కాగిన ఆ పట్టాల్ని
పయ్యలకు ఎక్కిస్తున్నప్పుడు
రొట్టెలపెంకును నల్లనిచందమామగా పోల్చడం,ఎర్రగా కాగిన పట్టాలను మండే సూర్యుడిని నుండి కత్తిరించి తెచ్చినట్టుగా ఊహించడం మొదలైనవి వెన్నెలసత్యంలోని భావుకుడిని, కళాత్మక దష్టిని పట్టిస్తాయి.
తాను తీసుకున్న ఉపమానాలు, రూపకాలు, ఉత్ప్రేక్షలు తన జీవితానికీ, ప్రకతికి ఎంతో దగ్గరగా ఉన్నాయి. భాషపరంగా చాలా కవితల్లో వడ్ల, కమ్మరి జీవితాలను ప్రతిబింబించే బాడిశ, ఉలి, రంపం, సుత్తె, పట్టుకారు, కమ్మల కత్తి, దాతి, కొలిమి, ఎడ్లబండి లాంటి పనిముట్లు, వత్తి సంబంధ పదాలు ఎక్కువగా కనబడుతాయి. మిగతా కవితల్లో సాధారణ భాష కనబడుతుంది.
చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, వ్యంగ్యంగ చెప్పడం, సంక్లిష్టమైన విషయాన్ని కూడా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సరళంగ చెప్పడం వెన్నెలసత్యం కవిత్వశైలి. ఇప్పటి వరకు వేయికి పైగా నానీలు రాశాడు ఈ కవి. నానీలలో ఉండే సంక్షిప్తగుణం, చివరి రెండు పాదాలలో ఉండే ''మెరుపు''లు వీరి కవితల్లో అందంగా ఒదిగిపోయాయి.
వెన్నెలసత్యం కవిత్వాన్ని నిర్వచిస్తు ''నిప్పుల్లో కాల్చి నిజాలకు/ పుటం పెట్టడమే కవిత్వమంటే'' అని అంటాడు. తన కవిత్వంలో కూడా ప్రభుత్వ విధానాలను, మనుషుల ద్వంద్వ వైఖరిని చెప్పడంలో నిర్భీతి, నిజాయితి కనబడుతాయి.
''కర్చీఫ్ ''కవితలో అమ్మ స్పర్శను గుర్తు చేసుకోవడంలో మానవీయత కనబడుతుంది. పారిశుద్ధ్య కార్మికుడిని నిజమైన బ్రాడ్ అంబాసిడర్గా చెబుతూ శ్రమకు గౌరవమిచ్చే వెన్నెల సత్యం కవితలలో చెమట పరిమళం కనబడుతుంది.
బతుకుచెట్టు, రచయిత :వెన్నెలసత్యం, వెల : 120
ప్రతులకు : 9440032210, అన్ని పుస్తక కేంద్రాలలో
- తగుళ్ళ గోపాల్
9505056316