Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు పదుల సాహిత్య చరిత్రలో, పరిణామాలతో మూడు తరాల సాహితీకారులతో సంబంధముండి ఎనభై ఏండ్లు దాటినా సాహితీ క్షేత్రంలో తన ప్రయాణాన్ని చైతన్యయుతంగా కొనసాగిస్తూన్న ప్రసిద్ధ కవి రచయిత నిఖిలేశ్వర్. సాహిత్యంలోనూ, దృక్పథంలోనూ నిబద్ధ జీవితానికి ప్రతీక నిఖిలేశ్వర్. ధిక్కార కవిగా, దిగంబర కవిగా, కథా రచయితగా, విమర్శకుడిగా 'కోపంతో వెనక్కి చూడు, యువతా నీ సంఘర్షణ, సమతా ఆందోళన, సంకీర్ణ మార్గాన్ని కోసి, సంకుచిత భావాన్ని తోసి, నీ లోకం అవతరించు చూడు' అంటూ అరంభించి కాలాన్ని అధిగమించే ప్రయత్నంలో కలంతో పోరాటం చేస్తూన్న నిఖిలేశ్వర్ గారితో జరిగిన ములాఖత్లో వారిలా ముచ్చటించారు.
మీ బాల్యం కుటుంబం నేపథ్యం
గతంలో నల్లగొండ జిల్లా ఇపుడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వీరెల్లి గ్రామంలో 1938లో జన్మించాను. కుంభం నర్సయ్య సురవరం నర్సమ్మ లు తల్లిదండ్రులు. మాది రైతు కుటుంబం. నాన్న ఇల్లరికం వచ్చాడు. కుటుంబంలో ఒక్కరూ అక్షరాస్యులు లేరు. నాకు ఏడాది వయసున్నప్పుడే నాన్న చనిపోయారు ఆ తర్వాత అమ్మ తన తమ్ముడు సురవరం నరసింహారెడ్డి వద్ద కొంతకాలం వ్యవసాయం చేసింది. అనంతరం నన్ను చంకన వేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఇండ్లలో పనులు చేసేది. చివరికి విఎస్టి (చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ) శ్రామికురాలిగా పనిచేస్తూ నన్ను చదివించింది.
నేను హైదరాబాద్ సికింద్రాబాద్ వీధి బళ్లలో అక్షరాలు దిద్దుకున్నాను. జమిస్తాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉండగా అప్పుడే ప్రారంభించిన ఉచిత హిందీ తరగతులకు వెళ్లి హిందీ నేర్చుకున్నాను. శారద భూషణ్ లలో ఉత్తీర్ణత సాధించాను. అప్పటి నుంచే హిందీ సాహిత్యం పరిచయమైంది. 1960లో హైదరాబాద్ సాయం కళాశాల (నిజాం కాలేజీ ఆవరణ) పీయూసీ, బి.ఏ, బిఎడ్ చేశాను. 1964-65లో ఉస్మానియాలో సైకాలజీ కోర్సు పూర్తి చేశాను. ఎంఏ మొదటి సంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాయలేదు.
సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
హెచ్ఎస్సి లో లెక్కల పరీక్ష తప్పి రెండేండ్లు కొంత అరాచకంగా తిరిగి తర్వాత ముషీరాబాద్లోని అభ్యుదయ యువక సంఘం స్థాపించి, సాహిత్య సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాను. ఆ సందర్భంగా ఎంతో నేర్చుకున్నాను. గతంలో చదివిన హిందీ సాహిత్యం భగవద్గీత పఠనం, ఆర్య సమాజ్ ప్రభావంతో వేదాల పరిచయం నా ఆసక్తిని పెంచాయి. కాలేజీలో చేరినప్పుడు ఆంగ్లంపై మక్కువ పెరిగింది. బిఏ లో ఇంగ్లీష్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ చేశాను. ఆ కాలేజీలోనే సహ విద్యార్థి ఎన్ హెచ్ కేశవరావు (నగముని), అలాగే మాకు జూనియర్ ఏవి రాఘవాచార్యులు (జ్వాలాముఖి), మాకు సీనియర్ సుబ్రహ్మణ్యం (దిగంబర కవుల సంచాలకుడు) సహచరులు. తెలుగు హిందీ ఇంగ్లీష్ సాహిత్యాల పట్ల ఆసక్తి పెరగటానికి ముషీరాబాద్లోని గౌరీశంకర్ గ్రంథాలయం కళాశాలలో అధ్యయనం ఉపయోగ పడింది. అమ్మకు ఏకైక సంతానంగా ఎంతో స్వేచ్ఛగా పెరిగాను. నిత్యం అధ్యయనం చేశాను.
చలం, శ్రీశ్రీ, శరత్ను చదువుతున్న కాలంలోనే హిందీలో ప్రేమ్చంద్ 'నిర్మల' నవల రామ్ నరేష్ త్రిపాఠి 'పథిక్' ఖండకావ్యం, రష్యన్ సాహిత్యం, సోమర్సెట్ మామ్ నవలలు, ఇలియట్ కవిత్వం మరోవైపు సాహిత్య అధ్యయనానికి ఊపునిచ్చాయి.
మీ అచ్చయిన తొలి రచన
చిన్న చిన్న కథలు 'బాల' లాంటి పత్రికల్లో వచ్చాయి 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ నాడు 'గోలకొండ' పత్రిక ప్రచురించిన సంచికలో తొలి రచన ''టెలివిజన్ ఎలా పనిచేస్తుంది'' కె.యాదవరెడ్డి పేరుతో అచ్చయింది. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. ఆ తర్వాత కళాశాల వార్షిక సంచికల్లో వచ్చాయి.
మీ కథల గురించి..
గత నలభై సంవత్సరాలలో నలభై కథలు రాసి ఉంటాను. వాటిలో 22 కథలు 'నిఖిలేశ్వర్ కథలు' సంపుటిగా వచ్చాయి. ఇతర భాషల నుండి అనువదించిన కథలు ఇరవై దాకా ఉన్నాయి. కథా వారధి పేర ఎమెస్కో ప్రచురించింది. కమలనాథ్, రాజేంద్ర యాదవ్ హిందీ నవలలూ అనువదించాను. తొలిదశలో కథలు, నవలలు రాయాలనే కోరిక ఉండేది. కానీ ఉద్యమపరంగా కవితా రచన జీవితంలో భాగమైంది. కథల ఇతివృత్తాలన్నీ విప్లవ పోరాటాలు, మన విద్యా వ్యవస్థ, స్త్రీ పురుష సంబంధాలు, మధ్య తరగతి సమస్యలు, యుద్ధం, మతం, భూమి తదితర సమస్యలకు సంబంధించినవి.
దిగంబర కవిత్వం వైపుకు ఎలా
1965 దిగంబర కవుల మొదటి సంపుటి వెలువడక ముందు మేం ఆరుగురం మా సొంత పేర్లతో రచనలు చేశాము. ఆ నాటికి నా రచన ఏది గ్రంథ రూపం దాల్చలేదు. కేశవరావు, కమ్మిశెట్టి కవిత్వం సంపుటిగా వచ్చాయి. అప్పటికే నేను 'కోపోద్రిక్త యువతరం' శీర్షికన కవితలు, రాజకీయ వ్యాసాలు 'గోలకొండ పత్రిక'లో రాసాను. బ్రిటన్లో ఆనాటికి వచ్చిన 'యాంగ్రీ యంగ్ మాన్ సాహిత్యంలో జాన్ అస్బార్న్ నాటకం లుక్ బ్యాక్ ఇన్ యాంగర్' నన్ను ప్రేరేపించింది. ఆ రోజుల్లో నా కవిత 'కోపంతో వెనక్కి చూడు' తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు 'రాత్రి' కవితా సంకలనం ఒక మలుపు. మేం ఆరుగురం యువ ఆగ్రహం, సామాజిక తిరుగుబాటుతత్వం, సాహిత్య రాజకీయ పరంగా ఒక 'బ్రేక్త్రో'తో ఏర్పడినవే దిగంబర కవుల మూడు సంపుటాలు. దీనిపై ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలూ వచ్చాయి.
దిగంబర కవుల భాషపై వచ్చిన విమర్శకు ఏమంటారు
ఒక ధర్మాగ్రహంలో పెల్లుబికిన భాష అది. అయితే కొన్ని కవితల్లో అశ్లీల పదజాలం కొంత మితిమీరినప్పటికీ అవి ఆనాటి యువ ఆగ్రహం, ఆక్రోశం.
కుల పీడనం గురించి ఇందులో ఆగ్రహం లేదే
అనేక వైరుధ్యాలు ఉన్న సమాజం సమూలంగా మారి ఒక మానవీయ వ్యవస్థగా రూపొందాలనే స్వప్నం దిగంబర కవులది.
అభ్యుదయ సాహిత్యోద్యమం మీపై చూపిన ప్రభావం
చారిత్రకంగా అభ్యుదయ సాహిత్యం మౌలికంగానే తన పాత్రను నిర్వహించింది. తొలిదశలో నాపై గురజాడ, శ్రీశ్రీ, సోమసుందర్ తదితరుల ప్రభావం ఉంది. 1965 నాటికి అభ్యుదయ సాహిత్యంలో స్తబ్ధత ఏర్పడింది. అందుకే దిగంబర కవులు, విప్లవ సాహిత్యం అవసరమైంది.
విరసంతో విబేధానికి కారణాలు
విరసానికి సంస్థాపక సభ్యునిగా, కార్యదర్శిగా సాహిత్య సాంస్కృతిక రంగంలో విప్లవ స్ఫూర్తితో పని చేయాల్సిన సంస్థ 1975 నాటికి విప్లవ గ్రూపుల పంథాల వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా చారుమజుందార్ అరాచక అతివాద పంథాను ప్రచారం చేసిన రచయితల ప్రాబల్యం పెరిగింది. అందువల్ల నేను ఇతర మిత్రులతో పాటు 1975 అనంతరం మహాసభలో బాహాటంగా వ్యతిరేకించి రాజీనామా చేశాను,ఆ తర్వాత నేను జ్వాలాముఖి జనసాహితి సంస్థాపక సభ్యులం. 'ప్రజాసాహితి' పత్రికకు రెండేండ్లు సంపాదకునిగా ఉన్నాను. అక్కడ కూడా ముఠా రాజకీయాలు, వ్యక్తిగత ప్రాబల్యాలు అనుభవంలోకి రావడంతో తప్పుకున్నాను.
ఇప్పుడు మన సమాజంలో విప్లవానికి ఏది సరైన మార్గం అనుకుంటున్నారు?
ప్రస్తుత భారతదేశంలో దళారి పెట్టుబడిదారీ ధనస్వామ్యం చేతిలో ప్రజాస్వామ్యమున్నది. అర్థ భూస్వామ్య లక్షణాలతో పాటు మతపరమైన దురహంకార పాలన కొనసాగుతున్నది. సమాజంలో అనేక సాంకేతిక మార్పులు వచ్చాయి. గతంలో వచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, శ్రీకాకుళం నక్సల్బరీ పోరాటాలు ఎన్నో అనుభవాలను ఇచ్చాయి. అనేక మార్పులొచ్చినా నేడు సాయుధ పోరాటం ప్రాసంగితకతను కోల్పోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజా విప్లవం కోసం కొత్త ప్రజా పోరాట రూపాలను అనుసరించాలి. వ్యూహాన్ని మార్చుకోవాలి. ఆత్మశోధన చేసుకోవాలి.
అస్తిత్వ ఉద్యమాల గురించి..
వామపక్ష ఉద్యమాలు విస్మరించడం వల్ల దేశంలో దళిత, స్త్రీవాద, బహుజనవాద అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయనే విమర్శ ఉంది. అందులో కొంత నిజం వున్నా ఉమ్మడి కమ్యూనిస్టు చరిత్రనూ విప్లవ గ్రూపుల చరిత్రనూ పరిశీలించినా ఆ విమర్శ పాక్షికమైనదని అర్థమవుతుంది. ఆయా అస్తిత్వ ఉద్యమాల సమస్యలన్నీ వామపక్ష ఉద్యమాలలో అంతర్లీనంగా వుండి, దేశంలోని ఫ్యూడల్ శక్తులను ప్రతిఘటించే శక్తిని అందించాయనే యధార్థాన్ని విస్మరించలేము. అయితే మారిన పరిస్థితులలో మహా మేధావి బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనలతో స్ఫూర్తితో ఉద్యమిస్తున్న దళిత, బహుజనులంతా ఏ నాటికైనా వామపక్ష వర్గ పోరాటాలతో మమేకం కాక తప్పదు.
అస్తిత్వ ఉద్యమాల ప్రభావాలు ఎలా ఉన్నాయి?
మన దేశంలో కుల వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే వుంది. దళితులు, స్త్రీలు, మైనారిటీలు అనేక అణచివేతలకు గురవుతున్నారు. వీటిని ప్రశ్నింంచి ధిక్కరిస్తున్న అస్తిత్వ ఉద్యమాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దళిత ఉద్యమాలన్నీ చివరకు రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో భాగస్వామ్యంతో సంతృప్తి పడుతున్నాయి. ఆత్మగౌరవం ఎజెండాలో వున్నా మౌలికంగా దేశంలో రావలసిన కుల రహిత సమాజం పట్ల స్పష్టత లేదు. భూస్వామ్య పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద అణచివేతల ధ్యాసే లేదు. వర్గపోరాటమనే మౌలిక పంథాను పక్కనబెట్టి కేవలం కులపోరాటాలే దిక్కు అని భావిస్తున్నారు. దళిత రాజకీయ నాయకులు సంజీవయ్య, జగజ్జీవన్రాం, మాయావతి మొదలైన వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా దళితులకు జరిగిన సామాజిక న్యాయమెంత? ఇక స్త్రీలు వ్యక్తిగత స్వేచ్ఛ లైంగికతనే ముఖ్యమని పురుషాధిక్యతను ధిక్కరించే వరకే పరిమితమయ్యారు. మైనారిటీలు తమలోని మతాధిపత్యాన్ని ధిక్కరించలేక పోతున్నాయి. అందువల్ల విస్తృతమైన ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించి శ్రామిక పీడిత వర్గాలను విభజించాయనేది వాస్తవం.
మీరు రాసిన సాహిత్య విమర్శ, రాజకీయ పరిణామాలపై రచనలు
కవిత్వంతో పాటు సాహిత్య విమర్శ కూడా రాశాను. మారుతున్న విలువలు - సాహిత్యం, కవిత్వ శోధన, మూడు సంపుటాలు వచ్చాయి. రాజకీయ పరిణామాలపై ''ఎవరిదీ ప్రజాస్వామ్యం - ఏ విలువలకీ ప్రస్థానం'' శీర్షికన సంపుటి వచ్చింది.
ఒక దృక్పథంతో కాక వ్యక్తుల కేంద్రంగా ఏర్పడుతున్న సాహితీ బృందాల గురించి ఏమంటారు
వ్యక్తుల కేంద్రంగా సాహితీ ముఠాలు తటస్థ పడుతూనే ఉన్నాయి. వ్యక్తి వాదులైన కవులకు రచయితలకు షార్ట్కట్ ఖ్యాతి కావాలి. పురస్కారాలు సన్మానాలు ఇవే వారి గమ్యం. సామాజిక, రాజకీయ నిబద్ధతను తిరస్కరించి శుద్ధ కళాత్మకవాదం పేరిట పలాయన వాదాన్ని ఆశ్రయిస్తారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ వ్యక్తి అస్తిత్వ ధోరణి ఆధునికానంతర వాదంగా దూసుకొచ్చి.. తర్వాత తోక ముడిచింది.
నేటి మతతత్వం సంస్కృతి ఏకీకరణ పెరుగుతున్న సందర్భంలో సాహిత్య కారుల కర్తవ్యం
భారతీయ ఏకాత్మకత అనే పేరుతో సంకుచితతత్వం విస్తరిస్తున్న మాట నిజం. కులతత్వంతో పాటు, పాలకుల్లో ఫాసిస్టు లక్షణాలు విజృంభిస్తున్నాయి. జాతీయ సంస్కృతి హిందూత్వంలోనే వుందని ఆర్ఎస్ఎస్ చెబుతూ సెక్యులర్ ప్రజాతంత్రవాదులపై, మైనారిటీలపై దాడులు చేస్తున్నది. ఈ మత దురహంకార దాడిని ఎదుర్కోవడానికి సాహితీ వేత్తలు, రచయితలు, మేధావులు ఐక్య సంఘటనగా ఉద్యమించాలి.
నేటి సాహిత్యంపై కవులకు మీరిచ్చే సందేశం..
సమకాలీన యువకులు కొందరు చక్కని చిక్కని కవిత్వం రాస్తున్నారు. కానీ అత్యధికులు ఇన్స్టాంట్ కాఫీలా ఏవో కొన్ని కవితల వంటివి రాసి ముద్రించి భుజాలు చరుచుకుంటున్నారు. నిరంతర అధ్యయనాలతో పాటు కవిత్వ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు భజనలు చేస్తున్న రచయితలు, కవుల సంఖ్య పెరిగిపోయింది. అభివ్యక్తి స్వేచ్ఛను అణగదొక్కుతున్న కాలమిది. ఈ సమయంలో నిజాయితీగా ప్రజల పరంగా నిర్భయంగా రచనలు చేయాలి.
ప్రస్తుత మీ సాహిత్య సృజన...
ప్రస్తుతం నేను జీవితానుభవాలను, జ్ఞాపకాలను 'నిఖిలలోకం' పేరిట స్వీయ చరిత్రను రాస్తున్నాను. నా యాభై సంవత్సరాల కవిత్వం 'నిఖిలేశ్వర కవిత్వం'గా వచ్చింది. 'అగ్ని శ్వాస' ఆంగ్ల కవితా సంపుటి 'లైఫ్ ది ఎడ్జ్ ఆఫ్ నైఫ్' వచ్చాయి. నా హిందీ కవితల సంపుటి 'ఇతిహాస్ కే మోడ్ పర్' వచ్చాయి.
ఇంటర్వ్యూ : కె.ఆనందాచారి, 9948787660