Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంత తొందరగా అతని మరణం గురించి రాయాల్సి వస్తుందను కోలేదు. అది కడసారి చూపుకూ నోచుకోలేని కష్ట కాలంలో కాలమెల్లదీస్తున్న రోజులు.
వ్యక్తిగా, కవిగా మాది 30 ఏళ్ల సాంగత్యం. ఎవరికైనా వారసత్వముంటుంది. అతని వారసత్వం తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం... ఉద్యమాల వారసత్వం. ఆ వారసత్వాన్ని కొనసాగింపై, ఎర్రజెండా నెత్తుకొని అడుగడుగునా కష్టజీవుల పాటై సాగినవాడు. పదమై నిలిచినవాడు నిసార్. అతడు ప్రజానాట్యమండలి గొంతుక.
కాలికి గజ్జెలు... భుజాన గొంగళి... బిగిసిన పిడికిలి... అతని ఆహార్యం.
ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన నిసార్, చిన్నప్పటి నుండి ఉద్యమాలను చూసి పెరిగినవాడు. అమ్మనాన్నలు అబ్బాస్, హాలీమా. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, పాటలతో పల్లెలను కదిలించి రజాకర్ మూకలను తరిమికొట్టిన సుద్దాల హనుమంతు ఊరు కూడా సుద్దాలే. హనుమంత్ కొడుకు, నిసార్ కలిసి చదువు కోవడం వల్ల పాటలపై అభిమానం ఏర్పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వల్ల పదవ తరగతి కాగానే పైచదువులు చదవలేక బతుకు పోరాటానికి బయలుదేరాడు.
బాల కార్మికుడిగానే లారీలల్లో క్లీనర్ పనికి కుదిరాడు. కుమిలిపోయే లేతమనసు... అలిసిపోయే శరీరం... ఆకలి బాధలు అనుభవిస్తూనే అనుభవాన్ని సంపాదించి డ్రైవర్గా మారాడు. పని తీవ్రత, నిద్రలేమి లాంటివి వత్తిలో ఉన్నా, గ్రామంలో అబ్బిన సాంస్కతిక వారసత్వ పరిమళాలు అతనిలో సున్నితత్వాన్ని నిరంతరం పచ్చగా ఉంచింది. తన ఆవేదనలు.. జీవితానుభవాలు...
ఊరిచ్చిన జ్ఞానం... కన్న తల్లైన ఎర్రజెండా ఒక రకమైన నిలబడనీయని స్థితిని కల్పించింది. చూస్తున్న బాధలను, జీవితాలను పాటగా వ్యక్తీకరించాలని తపన... ఆ సంధి దశలోనే పరిచయమైంది ప్రజానాట్యమండలి. అప్పటి నుండి ప్రజా ఉద్యమాలపై అతని భావనలను, పాట రాయడంలో మెలకువలు సానబెట్టి పాటల సైనికుణ్ణి తయారు చేసింది ప్రజానాట్య మండలి.
రాష్ట్రంలో వనితా కళాయాత్ర జరుగుతున్నప్పుడు, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన పాటల వర్కుషాప్లో రచయితలంతా ఒక్కొక్కరు కొన్ని కొన్ని పాటలు రాసినప్పుడు, మహిళల స్థితి గతులపై నిస్సార్ రాసిన పాట ''జన్మనిచ్చే తల్లి గొబ్బియ్యలో నీ బతుకు జన్మఖైదు గొబ్బియ్యలో'' జానపద బాణీలో జనాల్ని ఉర్రూతలూగించింది. అది మొదలు, అతని జీవితం ప్రజా నాట్య మండలితో, మమేకమై పోయింది.
తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేటలో వారం రోజుల పాటు ''ప్రజా ఉద్యమంలో పగటి వేషాలు'' వర్కు షాప్ జరిగింది. అక్కడ వివిధ రచయి తలు కొమ్ము దాసరి, బుడుబుక్కల, వీరబాహుడు, కొమ్ము దాసరి, పిట్టల దొర, తమాషా దేఖో లాంటివి 20 కళా రూపాలు తయారు చేయగా, పాములోడు, ఫకీరుసాబ్ అనే రెండు కళా రూపాలను నిసార్ రాసాడు.
పాములోడు కళారూపంలో, ఆ కాలంలో జరిగిన అనేక ఆర్ధిక కుంభకోణాలను పాములుగా పోలుస్తూ, ఒక్కొక పామును చూపెడుతూ చెపుతుంటే, నవ్విస్తూనే ప్రజలను ఆలోచింప చేసింది. ఇక ఫకీరు సాబ్ కళారూపంలో, ప్రజల బాధలు, ప్రత్యామ్నాయ రాజకీయలను ఆదరించమని చెప్పాడు. కళారూపాల చివరి రోజు, రాజమండ్రిలో వీటిని ప్రదర్శించినప్పుడు, ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, వచ్చిన అనేక కళారూపాలను మళ్లీ మీ నుండి చూస్తున్నామని, ప్రజలు అభినందనలు తెలియచేసారు.
హైదరాబాద్లో జరిగిన 18వ సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల ప్రచార కార్యక్రమంలో రాజకీయ,విశిష్టత మీద అతను రాసిన పల్లెసుద్దులు ఆడియో రూపంలో వచ్చినప్పుడు, ప్రజలను ఎంతగా కదిలించిందో ప్రత్యక్షంగా చూసిన మా కళాకారులకు తెలుసు.
హైదరాబాద్లో నీళ్ల కరువు వచ్చినప్పుడు, నీటి కోసం కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేశారు. అప్పుడు నిసార్ రాసిన
''తాగే నీళ్లు లేక ఉయ్యాలో
తల్లడిల్లుడాయే ఉయ్యాలో'' పాట, అతడు పాడుతుంటే, మహిళలు గుంపులుగా కొరస్ ఇస్తూ వారి నీటి కష్టాలకు కారణమైన పాలకులను ప్రశ్నించడం ఎప్పటికీ ఒక స్ఫూర్తి. బాల కార్మికులపై
''లే బిడ్డ పనికి యాళ్లైపోయే'' అనే పల్లవితో నత్య రూపకం రాసిందాన్ని ప్రజా నాట్య మండలి అనేక ప్రదర్శనలు ఇచ్చింది.
అతని పాటల్లో అన్నింటిలో కనిపించేది రాజకీయ మమేకత, వామ పక్ష దారి, పోరాటానికి కదిలించడం.
రాజకీయ కర్తవ్యాన్ని నిర్వర్తిం చడంలో, ఎర్రజెండాను ఎత్తి పట్టుకొని, నడవడంలో, కళాకారులు నిరంతరం ప్రజా ఉద్యమంలో ఉండడంలో ఎంత అవసరమో నిసార్ నిలబడ్డ తీరు మనకు చూపెడుతుంది.
ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగం వచ్చినప్పటి నుండి, రషటలో కార్మిక నాయకుడిగా పనిచేస్తూ, ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసే బండి సత్తెన్నతో కలిసి, దాదాపు 60 పాటలు రాశారు. నేటికీ ఇతరులు రాసిన పాటలు ఉన్నా, ప్రజానాట్యమండలి తరుపున వీరిద్దరూ రాసిన పాటలే అత్యధికం. ఆర్టీసీ కార్మికుల బాధలను చెపుతూ నిసార్ రాసిన,
''ఏ కైకి నౌకరీ భాయి
బేచైన్ జిందగి తేరి'' దాదాపు 15 చరణాలు ఉండేది.
''ఇది ఏమి కొలువాయేరన్నో
బతుకు బాధల సుడిగుండమన్నో'' అంటూ తెలుగులోకి అనువదించి ఉమ్మడి తెలుగు రాష్టాల్లో అన్ని డిపోల ముందు ప్రదర్శించారు. ఎక్కడకు పోయినా, కార్మికులు ఆ పాటలను హిందీలో, తెలుగులో పాడిపించుకొనే వారు.
1991 నుండి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు అమల్లో కొచ్చాక, నిసార్ రాయడం ఆపిందీ లేదు... ప్రదర్శనలకు అంతే లేదు.
'పండూ వెన్నెల్లలోన... వెన్నల్లలోన... పాడేటి పాటలే మాయె? అన్న పాట ఒక నత్య రూపకం. అది తెలంగాణ పల్లెల్లో ఎంత మందిని కదిలించిందో అందరికి తెలిసిందే?!
'బస్తమోసె హమాలీలపై, 'ఆకలిగొన్న పేగులు పీకలూ దుతున్నయి' అంటూ బ్యాండోళ్లపై, ముస్లిం జీవితాన్ని గురించి 'ముసల్మానులం' అని, 'సాయెబో! సాయెబో!' అని, కొన్ని వందల పాటలను ఉద్యమాలకు అందించాడు.
సమస్య ఎక్కడున్నా, అది ప్రజలదైనప్పుడు, వర్గ పునాదిపై విశ్లేషించుకొని, ముందు వరుసలో నిలబడేవాడు నిసార్. ప్రపంచీకరణ నేపధ్యంలో, నైపుణ్యం ఉన్న ప్రతీ కళాకారుణ్ణి కీర్తి కండూతికై పాకులాడేటట్లు చేస్తూ, ఉద్యమాల నుండి దూరం చేస్తున్న కాలంలోనూ, తాను నిరంతరం కష్ట జీవుల కుడి ఎడమల వైపు నిలబడి రాజ్యంతో తలపడ్డాడు.
ప్రజా రచయితలను పరిచయం చేసే అవకాశం 10 ్ఙలో నాకు వచ్చినప్పుడు, జనం పాట పేరు మీద సుందరయ్య పార్క్లో అతనిపై షూటింగ్ చేసినప్పుడు ఆ రోజంతా ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నామో!! మారిన పరిస్థితుల్లో వామపక్ష ఉద్యమాల్లో పనిచేసే కళాకారులంగా నూతన వరవడితో, ప్రజా శ్రేణుల్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నాలు చేయాలి నిసార్ భయ్యా అంటే, కలిసి పని చేద్దాం కామ్రేడ్ అనేవాడు. ఎంతోమంది ప్రలోభాలకు లొంగి పోతున్నారని మన నుండి దూరమవుతున్నారని బాధ పడే వాడు. ఎప్పటికైనా ఎర్రజెండా ఎర్రకోటపై ఎగరేస్తాం కామ్రేడ్ అంటూ సుద్దాల హనుమంత్ ముచ్చట్లు ఎన్ని చెప్పేవాడో!!
కవిగా...గాయగుడిగా...ప్రదర్శగుడిగా.. ఎర్రజెండాను మోసుకు తిరిగిన నిసార్ , ప్రతీ సమస్యపై పాటై నిలబడ్డాడు. కరోనా పై భయపడొద్దంటూ చెప్పి, ఈ మధ్యనే చనిపోయిన నర్స్పై పాట రాయాలి అంటూ, ఫోన్ చేసి చెప్పాడు. కష్టజీవుల కదన రంగంలో, పోటెత్తిన పాటను మోసుకు తిరిగే వారు ఎంత మంది ఉన్నా, నిసార్ స్థానమెప్పుడూ పదిలమే.
అతని భార్య ఆసియా, పిల్లలు ఇమ్రాన్, రిజ్వాన్, రుబీనాలు ఎప్పుడూ ఉద్యమ సానుభూతిపరులుగానే ఉన్నారు.
కదిలెల్లిన కాలంపై పాటల ముద్రలను వేస్తూ, బతు కంతా ప్రజల కోసం నిలబడ్డ ప్రజా కళాకారునికి ప్రజానాట్య మండలి తరుపున జోహార్లు అర్పిస్తున్నాం.అతడు నడిచిన దారుల్లో ప్రజానాట్యమండలి జెండాతో కష్ట జీవుల కదనానికి అండనిస్తూ సాగి పోవడమే నిసార్కు మనమిచ్చే నివాళి.
- స్ఫూర్తి, 9490098694