హైదరాబాద్ : కేరళలో గురువారం నుంచి భారీ వర్షాలు కురియబోతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వయనాద్, కొజిక్కోడ్లలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఉత్తర, మధ్య కేరళ జిల్లాల్లో బారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి, దక్షిణ దిశగా పయనిస్తోందని, అందువల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వయనాద్, కొజిక్కోడ్లకు రెడ్ అలర్ట్, ఉత్తర, మధ్య కేరళ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇడుక్కి, వయనాద్లలో 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో వయనాద్లోని మనంతవాడీలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇడుక్కిలోని మున్నార్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ ఇడుక్కి, వయనాద్ జిల్లాల కలెక్టర్లను కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm