సిద్దిపేట: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. సిద్దిపేట వస్ర్త, చేనేత విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 3.69 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇప్పటివరకు 2.84 లక్షల చీరలను అందజేసినట్లు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయంతో అన్ని మండల ప్రధాన కార్యాలయాలకు చీరలను పంపినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. మిగతా చీరలను మరో పది రోజుల్లో చేరవేయనున్నట్లు వెల్లడించారు. బతుకమ్మ పండుగ వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముగించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం నాడు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పక్షం రోజుల ముందే చీరల పంపిణీని ప్రారంభించిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm