విశాఖ: చెడువ్యసనాలకు బానిసైన కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది. ఈ ఘటన విశాఖ జిల్లా మధురవాడలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో నివాసం ఉంటున్న కోట్ల శ్రీను, మాధవి దంపతులకు అనిల్(18)తో పాటు కుమార్తె ఉన్నారు. గత కొంతకాలం నుంచి అనిల్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధిస్తున్నాడు. ప్రతీరోజూ బయట వ్యక్తులతో గొడవపడటంతోపాటు తల్లిదండ్రులపైనా భౌతికదాడులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయి ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ ఛాతీపై తల్లి మాధవి గ్యాస్సిలిండర్తో కొట్టి హత్య చేసింది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm