హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రూ.494 కోట్లకు టెండర్ ఆహ్వానించగా.. షాపూర్జీ పల్లోంజీ సంస్థ 4 శాతం.. ఎల్అండ్టీ 4.8 శాతం ఎక్కువగా కోట్ చేశాయి. బుధవారం సమావేశమైన కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) టెండర్ పత్రాలను అధ్యయనం చేయగా షాపూర్జీ పల్లోంజీ ఎల్-1గా నిలిచింది. దీంతో ఎల్-1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ సంస్థకు తాజాగా ఆర్అండ్బీ అధికారులు సచివాలయం నిర్మాణానికి సంబంధించిన అంగీకార పత్రం అందించారు. సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు పెట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm