హైదరాబాద్: మహారాష్ట్రలోని అహ్మాద్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం ఐదుగురు యవకులను బలి తీసుకుంది. పుణే-ఔరంగాబాద్ రహదారిపై దేవగడ్ ఫతా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి రోడ్డు అవతలి వైపు నుంచి వస్తున్న ప్రయివేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్తోపాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. షిరిడీ నుంచి బయలుదేరిన వీరు దేవగడ్ ఫతా వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి డివైడర్ నుంచి దూసుకెళ్లి బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కైలాశ్ నౌరు (32), రమేశ్ గుగే (40), విష్ణు చవాన్ (30), నారాయణ్ వర్కడ్ (25), శంతను కక్డేకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు నిర్దారించారు. జల్నా జిల్లాలోని మంథా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఓ వివాహ వేడుకకు హాజరై అనంతరం షిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనంతరం కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm