అమరావతి: ఆంద్ర ప్రదేశ్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పేలా లేదు. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ కోసం ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసులు రెట్టింపు అయితే అన్ని చోట్ల ఇదే తరహా ఆంక్షలు అమలయ్యే ప్రమాదం ఉంది. ఏపీలో పరిస్థితి భయపెడుతోంది. రోజు రోజుకూ కరోనా సోకిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. 20 రోజుల ముందు వరకు కేవలం 100ల్లోనే నమోదైన కేసులు.. ఇప్పుడు పది రెట్లు పెరిగాయి.. మొన్నటి వరకు రెండువేలు ఉండే కేసులు.. ఇప్పుడు ఐదువేల మార్క్ ను దాటిపోయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో పరిస్థితి ఏపీలోనూ భయపెడుతోంది. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రదేశాల్లో లాక్ డౌన్ నాటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే కరోనా టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరం ఇప్పుడు రెడ్ జోన్ గా మారుతోంది. జిల్లాలో ప్రతి రోజు 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ మార్కును దాటుతోంది. ఒక్క సారిగా కేసులు పెరుగుతుండడం అధికారులను కలవర పాటుకు గురి చేస్తోంది. ఇటు అధికారులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా .. కేసులు భారీగా పెరుగుతున్నా ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. దీంతో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత నెల వరకు ఒకటి రెండు కేసులతో గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఇప్పుడు డబుల్ సెంచరీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
చిన్నా పెద్దా తేడా లేకుండా కరోనా భారిన పడుతున్నారు. జిల్లాలో అధిక కేసులు ప్రధాన పట్టణాలు అయిన విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురపాం వంటి ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. పట్టణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మార్కెట్, స్కూల్, సినిమా థియేటర్లలో సామాజిక దూరం కనీసం పాటించకుండా ఇష్టానుసారం ప్రజలు తిరగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంక్య 42 వేల 585కి పెరిగాయి. అలాగే మరణాల సంఖ్య 238కి చేరాయి. అయితే ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పాములు పుష్పశ్రీవాని ఇలాకాలో కేసులు పెరగడం ఆందోళన పెంచుతోంది. దీంతో కురుపాంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకొచ్చారు.
ఈ నెల 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకే షాపులు తెరిచేందుకు వ్యాపారులు నిర్ణయించారు. మిగతా సమయాల్లో మాత్రం షాపులు మూసివేయాలని నిర్ణయించారు. వ్యాపారులతో ఎమ్మార్వో ఉమామహేశ్వరరావు, ఎస్ఐ రవికుమార్లు సమావేశమై కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇకపై మాస్కు ధరించని వారికి వస్తువులు విక్రయించకూడదని నిర్ణయించారు. ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొనేలా పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలెవరు అత్యవసరమైతే తప్ప గుంపులుగా రోడ్లపైకి రావొద్దని పిలుపు ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Apr,2021 06:07PM