చెన్నై: రాష్ట్రంలో రోజురోజుకు అధికమవుతున్న కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిని నిరోధించటంలో భాగంగా వారాంతపు సెలవుదినాల్లో కఠిన నిబంధనలతో లాక్డౌన్ అమలు చేయడం, రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వంటి అత్యవసర చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్రంజన్ శుక్రవారం మధ్యాహ్నం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు. చెన్నై సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్, రెవెన్యూ శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్, ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల సహకారంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రమంతటా మైక్రో కంటైన్మెంట్జోన్లను ఏర్పాటు చేసి పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తులను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చికిత్సలందించాలని కూడా అధికారులు ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే వైద్యనిపుణుల కమిటీ సలహాలను కూడా స్వీకరించాలని ప్రతిపాదించారు. వారాంతపు సెలవు దినాలల్లో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించేలా లాక్డౌన్ను అమలు చేయాలని మెజారిటీ అధికారులు సూచించారు. ఇదే విధంగా కఠిన నిబంధనలతో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకురాగలమని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అధికంగా ఉన్న చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కోవై సహా 19 జిల్లాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్లస్-2 పబ్లిక్ పరీక్షలను ప్రకటించిన తేదీల్లో నిర్వహించాలా? లేక వాయిదా వేయాలా? అనే అంశంపై కూడా సమగ్రంగా చర్చలు జరిగాయి. గురువారం జరిగిన విద్యాశాఖ ఉన్నతాధి కారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ సమీక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm