హైదరాబాద్ : తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతదా.. అంటూ ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. వికారాబాద్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ. అధికారంలో ఉన్నా మోడీ ఇప్పటివరకు ఏం చేయలేదు.. ఇంకా రెండేండ్ల కోసమైనా ఏమైనా చెబుతారని తాను కూడా ప్రధాని మోడీ పంద్రాగస్టు ప్రసంగం విన్నానని తెలిపారు. అందులో దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అని ప్రశ్నించారు. నెత్తిమీద రుమాలు కట్టి వేషం వేసి, డైలాగులు చెప్పడం తప్ప దేశానికి ఒక్క మంచి మాట చెప్పారా? అని నిలదీశారు. అందుకే అందరం చైతన్యవంతులం కావాలన్నారు. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్రంలో ప్రభుత్వం సరిగా లేకపోతే అభివృద్ధి అంతగా జరగదని చెప్పారు. కాబట్టి అక్కడ కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని తెలపారు. దేశ పరిస్థితి దిగజారుతోందని కావున ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనందరం భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm