తిరుపూర్: వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించగలడు కాని ఓ వ్యక్తి రేషన్కార్డుపై ఉన్న గణేశుడి చిత్రం మాత్రం ఆ వ్యక్తికి రేషన్ సరకులు అందకుండా అడ్డుపడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువూరు జిల్లాలో వెలుగుచూసింది. తిరువూరు జిల్లాలోని వడుగంపళాయం గ్రామానికి చెందిన నల్లశివం అనే వ్యక్తి రేషన్ దుకాణానికి వెళ్లి తన రేషన్ కార్డు తీసుకొని చూసి నిర్ఘాంత పోయాడు. తన రేషన్ కార్డుపై తన ఫోటో బదులు వినాయకుడి చిత్రం ముద్రించడాన్ని చూసిన నల్లశివం పౌరసరఫరాల శాఖాధికారులకు ఇచ్చి దాని స్థానంలో తన ఫోటోతో కొత్త కార్డు జారీ చేయాలని విన్నవించాడు. వినాయకుడి చిత్రం పుణ్యమా అంటూ తనకు ఈ నెల రేషన్ సరకులు రాకుండా పోయాయని నల్లశివం ఆవేదన వ్యక్తం చేశాడు. సేలం జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల సరోజా పెరియతంబి అనే మహిళకు తమిళనాడు పౌరసరఫరాలశాఖ పంపిణీ చేసిన రేషన్ కార్డులో సినీనటి కాజల్ అగర్వాల్ ఫోటో వచ్చింది. దీంతో ఆమె కూడా ఆశ్చర్యపోయి అధికారులకు ఫిర్యాదు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm