జార్ఖండ్ : ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు.. విగతజీవుడై పడి ఉన్నది తన సోదరుడే అనుకుని శరీర భాగాలను ఓ మహిళ రోడ్డుపై ఏరుతూ కనిపించింది. అయితే ఆమె ఇలా శరీర భాగాలను ఏరడానికి ఓ కారణం ఉంది. రోడ్డు మీద ఓ 30 సంవత్సరాల వ్యక్తిని ఏదో వాహనం గుద్దేసి వెళ్ళిపోయింది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి చుట్టూ జనాలు గూమికూడారు. ఆ జనంలో నుండి ఓ మహిళ ముందుకు వచ్చి.. అతన్ని చూసి ఏడుస్తూ కనిపించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన శరీరభాగాలను ఏరుతూ కనిపించింది. కొద్ది సేపటి తర్వాత పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. శవాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ఆమె కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళింది. అయితే కొద్ది సేపటికి ఆమె కొడుకు వచ్చి అమ్మా.. మామ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. పాపం ఎవరో వ్యక్తి చనిపోతే సొంత తమ్ముడనుకొని ఆ మహిళ అక్కడే ఉండిపోయింది. ఓ వైపు సోదరుడు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి ఆమె సంతోషించాలో.. నిండు ప్రాణం బలైందని బాధపడాలో ఆమెకు తెలీలేదు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం లోని గుమ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంచీ-గుమ్లా రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి ముఖం చిద్రమవడంతో చనిపోయింది తన సోదరుడేనని భావించింది బిగనీ దేవీ అనే మహిళ. మొదట బిగనీ దేవి తమ్ముడు చనిపోయాడని అందరూ అనుకున్నారు.. కానీ పక్కనే ఉన్న ఊరిలో అతను బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న ఆమె కొడుకు ఆమెకు విషయం చెప్పాడు. అలాగే ఆమె సోదరుడితో ఫోన్ లో మాట్లాడించడంతో ఆమె బాధ తీరిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm