హైదరాబాద్: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి ఒలింపిక్ గ్రహీత సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. ఓపెనింగ్ రౌండ్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 21-16, 21-13 తేడాతో ఓడిపోయింది. మరోపక్క పీవీ సింధు కూడా ఓడిపోవడంతో జపాన్ ఓపెన్ సిరీస్ భారత్ మహిళల సింగిల్స్ మీద ఆశలు కోల్పోవాల్సి వచ్చింది. సైనా, కరోలినా వీరిద్దరికీ ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్లో వీరిద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. చివరికి విజయం కరోలినాను వరించడంతో సైనా వెనుదిరగాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో సైనా మంచి ప్రదర్శన కనబరిచింది. మొదటి గేమ్లో 11-9 పాయింట్లతో సైనా ముందంజలో ఉంది. కానీ ఒక్కసారిగా కరోలినా విజృంభించడంతో సైనా ఓటమి పాలయింది. ఇక పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్లు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm