హైదరాబాద్: లోహవిహంగంపై పక్షలు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. వారంరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై దాడికి దిగాయి. దీంతో కంగారుపడిన పైలట్ ఏటీసీ సిబ్బందిని ఆశ్రయించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరాడు. దీంతో విమానాన్ని చైనాలో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యేంతవరకు ఈ దాడి జరగడం విశేషం. దీంతో రన్ వే రక్తసిక్తమైంది. కాక్ పిట్ పగలిపోయింది. పైలట్ పై కూడా పక్షులు దాడికి దిగాయి. విమానం వేగానికి కొన్ని పక్షులు చనిపోయాయి. కాక్ పిట్ లో ఎటు చూసినా పక్షుల శరీరభాగాలు పడిఉన్నాయి. విమానంలో చిక్కుకుపోయిన శరీర భాగాలను తొలగించేందుకు సిబ్బంది నానాపాట్లు పడ్డారు. కొన్ని గంటల ప్రయత్నం తరువాత వీటిని తొలగించగలిగారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్ వేస్ అధికారప్రతినిధి ప్రకటన చేస్తూ, ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి 12 విమానాల్లో ఒకటి ఈ పక్షుల దాడిబారిన పడుతుందని అన్నారు. విమాన సర్వీసును రద్దు చేశామని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm