జగిత్యాల: ఓ విద్యార్థి బ్యాగ్లో నాగుపాము కనిపించిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. మల్యాల మండలం లంబాడిపల్లి పాఠశాలలో సిరిగిరి ప్రవీణ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం పాఠశాలకు వచ్చాడు. ఏదో రాసుకుందామని పెన్ను తీయడానికి బ్యాగ్లోపల చేయి పెట్టాడు. బ్యాగ్లో అతని చేతికి మెత్తగా తగిలింది. అది ఏంటో చూద్దామని మరోసారి చేయి పెట్టేసరికి ఒక్కసారిగా పాము బయటకు వచ్చి బుస్సుమంది. వెంటనే తరగతి గదిలో ఉన్న విద్యార్థులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న పాఠశాల సిబ్బంది, స్థానికులు పామును చంపేశారు. అయితే విద్యార్థి ఇంట్లోనే పాము బ్యాగులోకి దూరి ఉండొచ్చని భావిస్తున్నారు. విద్యార్థి ఇంటి సమీపంలోని పొదల్లో పాములు తిరుగుతున్నటు గమనించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm