హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి చట్టపరమైన అంశాలను పరిచయం చేసింది న్యాయవాదులేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ న్యాయవాదుల ఐకాసతో కోదండరాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కోర్టుల్లో వివరించింది కూడా వారేనని, ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారన్నారు. వారంతా సంఘటితమైతే డిమాండ్ల గురించి అడగవచ్చని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ న్యాయవాదులకు సహాయం, సహకారం రెండూ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశాలపై గతంలో హామీలు ఇచ్చిందని.. ఇవి సాధించుకునే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. 41 సీఆర్పీసీని రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదుల ఐకాస కన్వీనర్ కొండారెడ్డి అన్నారు. న్యాయవాదులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, న్యాయశాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm