హైదరాబాద్ : వంట రాదంటూ తరచూ భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఓ వివాహిత నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మారయ్య కథనం ప్రకారం ఉప్పల్కు చెందిన జి. శ్రీనివాస్రెడ్డి, సుభద్రలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురైన శ్రీలతను నల్గొండ జిల్లా, మిర్యాలగూడెంకు చెందిన సూదిని చెన్నారెడ్డి కుమారుడైన అనంతరెడ్డికి ఇచ్చి 2017 ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలోనే శ్రీలతకు వంట రాని విషయం భర్త అనంతరెడ్డికి ఆయన తల్లిదండ్రులకు తెలియజేశారు. వంట తాను నేర్పించుకుంటానని అనంతరెడ్డి పెద్దల సమక్షంలో ఒప్పుకొని శ్రీలతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఎల్బీనగర్ బైరామల్గూడ, సాయినగర్కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భార్య శ్రీలతను అనంతరెడ్డి కాపురానికి తీసుకువచ్చాడు. నాటి నుంచి నీవు వంట సరిగా చేయడం లేదంటూ శ్రీలతను భర్త అనంతరెడ్డి తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఈనెల 15న నీకు వంట రాదు.. నీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ భర్త వేదిస్తూ శ్రీలతతో మాట్లాడం మానేశాడు. ఈనెల 16న ప్రతాప్రెడ్డి ఉద్యోగానికి వెళ్లే సమయంలో శ్రీలతతో మాట్లాడకుండా వెళ్లి పోయాడు. తీవ్ర వేదనకు గురైన శ్రీలత ఈనెల 16న మధ్యాహ్నం సమయంలో నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడింది.
Mon Jan 19, 2015 06:51 pm