జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతుంది. సుఖ ప్రసవాల కోసం అమ్మ ఒడి అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చింది. గర్భిణీలు, శిశువుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టినప్పటికీ 108 సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. 108 సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. వెంకటాపురం మండల కేంద్రం సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఆదివాసీ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆ గర్భిణీ.. ప్రభుత్వాసుపత్రికి చేరుకోవాలంటే 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిందే. ఈ క్రమంలో 108 సిబ్బందికి సమాచారం అందించారు. గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువైపోతున్నాయి. మూడు గంటలైనా 108 సిబ్బంది రావడం లేదు. దీంతో గ్రామస్థులు ఎడ్ల బండిపై గర్భిణీని తీసుకొని ఆస్పత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే పురిటి నొప్పులు అధికమవడంతో ఎడ్ల బండి దిగి నడుస్తున్న క్రమంలో గర్భిణి ప్రసవించింది. దీంతో శిశువు కిందపడటంతో తలకు గాయమై మృతి చెందాడు. తండ్రి చందు.. తన పసిబిడ్డ మృతదేహాన్ని సంచిలో వేసుకుని గుంత తవ్వి ఖననం చేశాడు. 108 సిబ్బంది సరైన సమయానికి రాకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని గ్రామస్థులు ధ్వజమెత్తారు. 108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm