హైదరాబాద్ : కాపులకు బీసీ రిజర్వేషన్ను రెండు నెలల్లో అమలుచేస్తామని కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇచ్చిన మాట మేరకు వచ్చేనెల 6వ తేదీన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ ప్రకటన చేసి తమకు తీపికబురు చెప్పాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని బీసీ నేతలతో చంద్రబాబు నాయుడు కావాలనే చెప్పిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. అలాగే, భవిష్యత్తులో కాపుల విషయంలో ఎటువంటి గొడవలు రాకుండా కాపుల రిజర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ కూడా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఈ లేఖను మనసు పెట్టి చదవాలని, ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం కోసం తమ జాతి ఎదురు చూస్తోందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm