కాచిగూడ: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో ఓ వ్యక్తి బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, విలువైన వస్తువులను తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్సై ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మదీనగూడ ప్రాంతానికి చెందిన దొరబాబు కుమారుడు కె.వి వంశీధర్(30) వృత్తిరీత్యా హైటెక్ సిటీలో డిలైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వంశీధర్తో పాటు భార్య, తల్లిదండ్రులు కలిసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. వెంకటాద్రి-కాచిగూడ రైల్లో కాచిగూడకు వస్తుండగా తిరుపతి రైల్వేస్టేషన్లో మాటువేసి గుర్తుతెలియని దుండగులు వంశీధర్ బ్యాగులో ఉన్న రూ.3వేల రూపాయలు, 2 డెబిట్ కార్డులు, 2 క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్కార్డులను దొంగిలించారు. వంశీధర్ కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం తిరుపతి రైల్వేస్టేషన్కు బదిలీచేసినట్లు రైల్వే ఎస్సై ఆదిరెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm