హైదరాబాద్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు కోసం రేపటి నుండి జూరాల ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కానుంది. ఈ నీటితో దాదాపు 15 వేల ఎకరాల పంటకు ఆఖరు తడి సమకూరనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సచివాలయంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 15 వేల ఎకరాల పంటను కాపాడేందుకు ఆఖరి తడికి నీరు ఇవ్వాలని నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. జూరాలలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ రెండు, మూడు రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అంగీకరించారు. రేపటి నుండి జూరాల నుండి భీమ-2కు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. దీంతో కొల్లాపూర్, వనపర్తి, మక్తల్ నియోజకవర్గాల్లోని దాదాపు 15 వేల ఎకరాల్లో పంటలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి. ఇరిగేషన్ శాఖ ఈఎన్ సీ మురళీధర్రావు, సీఈ ఖగేందర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm