ముంబై: ప్రభుత్వ ఉద్యోగాల్లో, చదువులో అనాధలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర కేబీనేట్ బుధవారం సమావేశమైన సందర్భంగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 52 శాతానికి చేరుకుంది. కాగా ఈ కొత్త రిజర్వేషన్ను పారాలాల్ రిజర్వేషన్గా అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తమ కులాలు ఏంటో తెలియని అనాథలకు వర్తించనున్నాయి. చాలా మంది అనాధలకు తమ కులమేమిటో తెలియకపోవడం వల్ల రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోతున్నారని, అలాంటి వారికి చేయూతనందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో అనాధ పిల్లల పునరావాసం సులభతరమవడంతో పాటు వారి భవిష్యత్కూ భరోసా ఏర్పడిందని ఆయన చెప్పారు. కాగా మహారాష్ట్రలోని ప్రభుత్వ అనాథాశ్రమాల్లో 3,900 మంది అనాథలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm