కాబూల్: కాబూల్లోని ఇంటర్ కాంటినెంటల్ లగ్జరీ హోటల్ మరోసారి ఉగ్రవాదులకు టార్గెట్గా మారింది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు నలుగురు సాయుధులు హోటల్లోకి ప్రవేశించారు. అత్యాధునిక ఆయుధాలతోపాటు రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లతో దాడి చేశారు. ముంబై ముట్టడి తరహాలో దానిని గుప్పిట పట్టారు. విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. కొంతమందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్లోని కొన్ని ఫ్లోర్లకు నిప్పు పెట్టారు. బహుళ అంతస్తుల హోటల్లో ఉగ్రవాదులు స్వైర విహారం చేస్తున్నారు. కాల్పులకు నాలుగో ఫ్లోర్లో ఉన్న కిచెన్ తగలబడింది. దాంతో ఆ అంతస్తు మొత్తానికి నిప్పంటుకుంది. హోటల్లోని అతిథులు హాహాకారాలు చేస్తున్నారు. తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. కాల్పుల్లో 15 మంది వరకూ చనిపోయి ఉంటారని సన్ పత్రిక పేర్కొంది. మృతుల సంఖ్య 35 దాకా ఉంటుందని వాయిస్ ఆఫ్ అమెరికా ప్రతినిధి చెప్పారు. ఒకపక్క కాల్పులు కొనసాగుతుండగానే మరోవైపు హోటల్ మంటల్లో కాలుతోందని, పరిస్థితి భయానకంగా ఉందని హోటల్ నుంచి ఓ వ్యక్తి తెలిపాడు. హోటల్ నుంచి పెద్దఎత్తున పేలుళ్లు కూడా వినిపిస్తున్నాయని చుట్టుపక్కల ప్రజలు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మృతులు, క్షతగాత్రుల వివరాలు అర్ధరాత్రి వరకూ బయటకు రాలేదు. అఫ్ఘాన్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయని, ఎదురు కాల్పులు ప్రారంభించాయని, ఇప్పటికే ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయని, మరో ముగ్గురు హోటల్లోనే ఉన్నారని అఫ్ఘాన్ అంతర్గత భద్రతా శాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానిష్ తెలిపారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారని తెలిపారు. మూడు, నాలుగు అంతస్తుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm