హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పోలాండ్ అంబాసిడార్ ఆడమ్ బురాకోవస్కీ ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కలిశారు. పవన్ దంపతులు పోలాండ్ బృందానికి సాధర స్వాగతం పలికారు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ కొందరు పోలాండ్ వాసులతో భేటీ అయ్యారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న ఆడమ్ పవన్ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో ఆడమ్తో పాటు 20 మంది పోలాండ్ విద్యార్థులు పవన్ను కలిసారు. కాగా పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రను కొండగట్టు నుంచి కొనసాగుతుందని శనివారం ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టిపెట్టాయి. అందులోభాగంగానే జనసేన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ తన టూర్ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం కూడా తన నిరంతర రాజకీయ యాత్రని కొండగట్టు నుంచి ఆరంభించడానికి కారణ భూతమైందని పవన్ తెలిపారు. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులతో ప్రజల సమస్యల అధ్యయనానికి యాత్ర ద్వారా వారి ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు. పర్యటనకు సంబంధించిన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని తెలిపిన పవన్ తనని ఆశీర్వదించాల్సిందిగా ప్రజల్ని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm