డిల్లీ: గత నాలుగు రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కు భారీగా కుచ్చుటోపీ పెట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలకు చెందిన కంపెనీలు, దుకాణాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 200 డొల్ల కంపెనీలు, భారీగా బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈడీ అధికారులు పీఎంఎల్ఏ కింద 24కి పైగా స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఈడీ అధికారులు చోక్సీకు చెందిన జ్యూయలరీ షోరూమ్స్, వర్కషాప్స్తో పాటు 45 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. నీరవ్ మోదీకి గ్రూపునకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలను ఇప్పటివరకు స్తంభింపజేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని ఈడీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ డొల్ల కంపెనీలను చూపించి భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. నీరవ్, చోక్సీ కేసులను విచారించేందుకు ఈడీ, ఐటీ శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈడీ అధికారులు రూ.5,674కోట్ల విలువైన వజ్రాభరణాలు, ఇతర ఖరీదైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm