ఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణం వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది! నీరవ్కు చెందిన షోరూమ్లో గతంలో రూ.6 కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సతీమణి అనిత సింఘ్వీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కొనుగోలుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని అందులో పేర్కొంది. నోటీసుల నేపథ్యంలో తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో తన కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్నారని అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం అనిత ఆభరణాలు కొనుగోలు చేసింది. అందుకు ఎంత మేర నగదు చెల్లించారు, ఎంత విలువకు చెక్కులు ఇచ్చారో తెలపాల్సిందిగా ఐటీ శాఖ తాజాగా నోటీసులు పంపినట్లు తెలిసింది. రూ.1.5 కోట్లు చెక్కు ద్వారా, రూ.4.8 కోట్లు నగదు రూపంలో చెల్లించారని ఐటీ భావిస్తున్నట్టు సమాచారం. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న కేసులో అనితకు నోటీసులు పంపించారు. కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వివరాలు, నిధులు ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో ఐటీ శాఖ తెలుసుకోవాలని భావిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm