హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఐదు మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ... తమ అధినేత జగన్ ఆదేశాలతో పోరాడుతున్నామని తెలిపారు. ఎంత మంది ఉన్నాం అనేది పాయింట్ కాదని... పార్లమెంటును వణికించామా? లేదా? అనేదే ముఖ్యమని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఉన్నప్పటికీ... ఏ రోజు కూడా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కృషి చేయలేదని విమర్శించారు. అవిశ్వాసం ద్వారా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ మానవహారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన మానవహారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm