నేడు భగత్ సింగ్ ఉరి తీయబడిన రోజు... ఉరి తీయబోయే ముందు తన చివరి కోరిక ఏమిటని అడిగినపుడు, భగత్ సింగ్ స్పందించిన తీరు ఆనాటి సామాజిక అంశాలకు అద్దం పట్టడం ఒక ఎత్తైతే, భగత్ సింగ్ కోరుకున్న నవ భారతం మరో ఎత్తు. ఈ ఘటన పై కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కడిగళ్ల భాస్కర్ రాసిన వ్యాసం లోని 'అంతిమ భోజనం' భాగం మీ కోసం...
నా ఆఖరి కోరికగా.. నేను అమ్మ చేతివంట తినాలనుకుంటున్నాను.. తీర్చగలవని జైలర్కు భగత్సింగ్ తన ఆఖరి కోరిక చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కానీ జైలర్ నిశ్శబ్దం నుంచి బయటపడి వణుకుతున్న గొంతుతో 'భగత్ నీ కోరిక నేనెలా తీర్చను? ఇంతకుముందే మీ అమ్మతో ఆఖరి క్షణాల్లో నన్ను కలవడానికి మళ్లీ రావద్దు అన్నావు కదా! ఇప్పుడు మీ అమ్మ చేతివంట నేనెలా తీసుకురాగలనని' ఆందోళన పడతాడు. అప్పుడు భగత్సింగ్ ''నేను ఆ అమ్మ చేతివంట గురించి చెప్పడం లేదు. ఇక్కడి ఈ అమ్మ చేతివంట గురించి మాట్లాడుతున్నానంటూ ఆ కారాగారంలో మరుగుదొడ్లు శుభ్రం చేసే దళిత ఉద్యోగి బోధా వైపు చెయ్యి చూపుతాడు...'' జైలు ఉద్యోగులే కాదు ఖైదీలు కూడా బోధాను భంగీ లేదా పాకీ లేదా బోధా అని పిలుస్తారు. కానీ భగత్సింగ్ ఇప్పుడే కాదు... ఇంతకు ముందు నుంచే బోధాను ''అమ్మా..!'' అని పలకరించేవాడు. అమ్మ చేతివంట తింటానని భగత్సింగ్ చెప్పగానే, అతనిని అమ్మా..! అంటున్నావా అని జైలర్ ఖాన్ బహదూర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ''అవును, నేను అతడినే అమ్మా అంటున్నాను, నా తల్లి నన్ను చిన్నప్పుడు మాత్రమే శుభ్రం చేసింది. బోధా మాత్రం జైలులో అందరి మురికిని శుభ్రపరుస్తున్నాడు. అందుకే నేను అతని చేతి అన్నమే తినాలనుకుంటున్నాను అనగానే, బిడ్డా..! నువ్వు నాచేతి వంట తిని నీ ఆచారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటావు అంటూ బోధా గద్గద కంఠంతో అడిగితే, నీవు పెట్టిన భోజనం తిని నా పూర్వీకుల పాపాలన్నీ కడిగేయాలనుకుంటున్నానని భగత్సింగ్ బోధాను ఆలింగనం చేసుకుంటాడు. బోధా వంట చేస్తాడు. పొంగుకొచ్చే దుఃఖాన్ని దిగమింగుతూ, తుడుచుకుంటూ వడ్డిస్తాడు. కానీ భగత్ మాత్రం నవ్వుతూ హాయిగా తింటాడు. ఎన్నో తరాలనుంచి ఆకలిగా ఉన్నవాడిలా ఇష్టంగా తృప్తిగా భోంచేస్తాడు.
తరువాత తన మిత్రులైన రాజ్గురు, సుఖ్దేవ్లను ఆలింగనం చేసుకొని ''ఇంక్విలాబ్ జిందాబాద్'' అని నినదిస్తూ ఉరికంబం వద్దకు చేరుకోగానే అక్కడున్న ఆంగ్లేయ డిప్యూటీ కమిషనర్ ఆ ముగ్గురు వీరులను చూడగానే కంపించిపోయాడు. భగత్సింగ్ ఆ ఆంగ్లేయ డిప్యూటీ కమిషనర్నుద్దేశించి ''వెల్, మిస్టర్ మెజిస్ట్రేట్, యు ఆర్ ఫ్యార్చునేట్ టు ప్రాబబ్లీ టు సీ హౌ ఇండియన్ రెవల్యూషనరీస్ కెన్ ఎంబ్రెస్ డెత్ ప్లెజర్ ఫర్ ది కేస్ ఆఫ్ దేర్ సుప్రీమ్ ఐడియల్ (జడ్జిగారు! మీరు అదృష్టవంతులు. భారతీయ విప్లవకారులు తమ అత్యున్నతమైన ఆదర్శం కోసం మృత్యువును సైతం ఎంత సంతోషంగా స్వీకరిస్తారో చూడబోతున్నారంటాడు.) భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ''ఇంక్విలాబ్ జిందాబాద్'', సామ్రాజ్యవాదం నశించాలని నినాదాలిస్తూ ఉరికంబం వైపునకు నడుస్తారు. పక్కనే నిలబడి ఉన్న బోధా బోరున గుండెలవిసేలా ఏడుస్తూ వారితోపాటు బోధా కూడా గొంతుకలిపి కుడి చేత్తో కండ్లు తుడుచుకుంటూ ఎడమ చేయి పిడికిలి బిగించి పైకెత్తి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తుండగానే ముగ్గురికీ ఉరితాడు బిగుసుకుంటుంది.
పూర్తి వ్యాసం కొరకు : ఇక్కడ చూడండి
ఈ పేపర్ : క్లిప్
వ్యాసకర్త: కె. భాస్కర్ , మొబైల్ నెం: 9491118822