న్యూఢిల్లీ: ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో కార్తీ చిదంబరానికి ముందస్తు బెయిలును ఢిల్లీ ప్రత్యేక కోర్టు శనివారంనాడు మంజూరు చేసింది. ఎప్పుడు సమన్లు పంపినా ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరు కావాలని కార్తీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. కార్తీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై శనివారంనాడు ఇరువర్గాల వాదనలను కోర్టు వింది. కార్తీకి ముందస్తు బెయిలు ఇవ్వరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు తన వాదన వినిపించింది. ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ విషయంలో కార్తీ అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కార్తీ కోర్టును కోరారు. ఈ వాదనతో ఈడీ విభేదిస్తూ, వేర్వేరు కోర్టులను వేర్వేరు దరఖాస్తులతో కార్తీ అశ్రయించినట్టు కోర్టు దృష్టికి తెచ్చింది. కార్తీ తరఫున కపిల్ సిబాల్ తన వాదన వినిపిస్తూ, క్లియరెన్స్ ఇచ్చినది అప్పటి ఆర్థిక మంత్రి అయితే, కార్తీ ప్రమేయం ఏముంటుందని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు కార్తీకి ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm