కోల్కతా: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) శనివారంనాడు ప్రకటించింది. బీజేపీపై గూర్ఖాలు ఉంచిన నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని జీజేఎం ఆర్గనైజింగ్ చీఫ్ ఎల్ఎల్ లామా ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో ఇంకెంతమాత్రం తమ పార్టీ సంబంధాలు కొనసాగించేది లేదని తెగేసి చెప్పారు. జీజేఎంతో ఎన్నికల పొత్తు మాత్రమే తాము పెట్టుకున్నట్టు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇటీవల చేసిన ప్రకటనపై జీజేఎంలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఎన్డీయే కూటమికి ఉద్వాసన చెబుతున్నట్టు జీజేఎం ప్రకటించింది. గూర్ఖాల కలే మోదీ కలంటూ బీజేపీ చెప్పింది. దిలీప్ ఘోష్ ప్రకటనతో బీజేపీ మాటలన్నీ బూటకాలని అర్ధమైంది. ఉమ్మడి రాజకీయ తీర్మానం ఏమీ లేదని, ఎన్నికల ముందు పొత్తు మాత్రమే మా మధ్య ఉందని ఘోష్ ప్రకటించారు. దీంతో గూర్ఖాల డిమాండ్పై బీజేపీకి సానుభూతి కానీ, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానీ లేదనే విషయం తేలిపోయిందిః అని లామా మండిపడ్డారు. బీజేపీ కోసం గూర్ఖా జన్ముక్తి మోర్చా ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. 2009, 2014 ఎన్నికల్లో డార్జిలింగ్ లోక్సభ సీటును జీజేఎం బహుమతిగా ఇచ్చిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm