హైదరాబాద్ : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యపై పోలీస్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. జడేజా భార్య రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు రాంగ్ రూట్లో వస్తున్న కానిస్టేబుల్ సంజయ్ అహిర్ ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొంది. సోమవారం సాయంత్రం గుజరాత్లోని జామ్నగర్లో సారు సెక్షన్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు, బైకును ఢీకొన్న వెంటనే ఆగ్రహంగా కారు వద్దకు చేరుకున్న కానిస్టేబుల్ అహిర్ ఆమెతో వాగ్వాదానికి దిగి ఆపై దాడి చేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలైనట్టు జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు. ఒకానొక దశలో రీవాను జట్టు పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రీవాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని, దాడికి దిగిన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. రీవా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్ను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm