హైదరాబాద్ : ఓ మహిళా టెలీకాలర్ పై కంపెనీ యజమాని అత్యాచారం జరిపిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. సంతో్ష్ నగర్కు చెందిన షహన్షా షరీఫ్(23) రోబోటిక్ డిప్లొమా చేశాడు. కొన్నాళ్లు కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేసి వచ్చాడు. అనంతరం సంతో్ష్ నగర్వాసి మహ్మద్ ఇర్ఫాన్, చంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన మహ్మద్ మినాజ్తో కలిసి హబ్సిగూడలో మైరా టెక్నాలజీస్ పేరుతో ఓ ఫర్మ్ నిర్వహించాడు. నాచారం పరిధిలోని ఓ యువతిని టెలీకాలర్గా నియమించుకున్నాడు. ఆఫీస్ పనిమీద అంటూ ఆమెను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేవాడు. ఈ ఏడాది మార్చి 10న ఆమెను జహనుమ సమీపంలోని వట్టేపల్లికి తీసుకెళ్లి, ఓ అద్దె గదిలో ఉంచి నెల రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి, తన వెంట రాకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఆమెను బెదిరించి ముంబైతోపాటు పలు రాష్ట్రాలకు తీసుకెళ్లాడు. తన భార్య విడాకులిచ్చిందని, పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు. 8 రోజుల క్రితం బాధితురాలు షరీఫ్ నుంచి తప్పించుకుని నగరానికి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm