హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిఆర్ఎస్ పాత్ర లేదన్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఆజాద్కి ఏమీ తెలియదని, అంతా తెలుసునని మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ప్రకటన చేసిన తర్వాత ఆంధ్రా నేతల ఒత్తిళ్లకు కాంగ్రెస్ తలొగ్గి వెనక్కి తీసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ పాత్ర లేకుండా తెలంగాణ వచ్చిందంటారా? అని వినోద్ అన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టింది టీఎస్ఎస్ అని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేశారో రాశారని వినోద్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm