హైదరాబాద్: భార్యా భర్తలు వేర్వేరు పార్టీలో ఉండడం తప్పుకాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ దేవాలయాల పునరుద్ధరణలో పద్మినీరెడ్డి ఎంతో కృషి చేశారని, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. నరేంద్రమోదీ పనితీరు నచ్చి ఆమె పార్టీలో చేరారని ఆయన అన్నారు. దేశంలో మహిళలకు మోదీ పెద్ద పీట వేస్తున్నారని, మహిళా సాధికారికత కోసం, అక్షరాల అమలు చేసే పార్టీ బీజేపీ అని పద్మినీరెడ్డి భావించి పార్టీలో చేరారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆమెకు రాజకీయాలు, సంఘ సేవ కొత్తకాదన్నారు. ఆమె రాకతో పార్టీకి మరింత బలం చేకూరిందని, మహిళల్లో కూడా భరోసా కలుగుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm