హైదరాబాద్: పాలకులు మారినా ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదు. అందుకే బీఎల్ఎఫ్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజలంతా సమస్యల గోడు వివరిస్తున్నారు. తాము అనుభవిస్తున్న ఈ కష్టాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలేనని నిర్మోహమాటంగా అంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏండ్లయినా ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదు. పేదరికం ఆనాటి నుంచీ నేటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక అసమానతలతోపాటు అంటరానితనం, కులవివక్ష వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ అనుసరించిన ఆర్థిక విధానాలొక్కటే. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు షరతులతో కూడిన విధానాలు అవలంబించడం వల్లే ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. బీఎల్ఎఫ్ అభ్యర్థులకు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలించినా సమస్యలు తీరలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పరిష్కారానికి నోచుకోలేదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలవైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm