ఢిల్లీ: గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధర నేడు దిగివచ్చింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం రూ.110 తగ్గి పది గ్రాముల పసిడి రూ.32,540కి చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం వల్ల పసిడి ధర తగ్గినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. గత మూడు సెషన్స్లో బంగారం ధర సుమారు రూ.550 పెరిగింది. బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.25 తగ్గడంతో కిలో వెండి రూ.38,550కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడం వల్ల వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర పడిపోయింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు 1,242.08డాలర్లు పలికింది.
Mon Jan 19, 2015 06:51 pm