హైదరాబాద్ : సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిన సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్లో చోటుచేసుకుంది. శంకర్పల్లి ఎస్సై సంజీవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుణ్యవతి కుమార్తె ఎన్.శృతి(20) వట్టినాగులపల్లిలోని ఎస్.ఎస్.జే ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్ ఫోన్ లో మాట్లాడుతుండటం, చాటింగ్ చేస్తుండటం గమనించిన తల్లి శుక్రవారం సెల్ లాక్కొని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సీఐ లింగయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm