హైదరాబాద్:దేశరాజధాని ఢిల్లీకి వెళ్తే జర పైలం. ఎవరైనా పోరడు ఢీకొట్టి కావలించుకుని సారీ చెప్తే అంతే సంగతులు. మీ జేబుల్లోని పర్సు, సెల్ఫోన్ ఇతర వస్తువులు మాయమయ్యే ప్రమాదముంది. ఇటీవల ఢిల్లీలో తెగ రెచ్చిపోతున్న ఈ ముఠాకు సారీ గ్యాంగ్ అని పేరు. నలుగురు గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేయడంతో వీరి గుట్టంతా వెలుగు చూసింది. దూరప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చే కొత్తవారిని టార్గెట్ చేసుకోవడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ఇక వీరు అనుసరించే టెక్నిక్ను బట్టే వీరికి సారీ గ్యాంగ్ అనే పేరు వచ్చింది. ముందుగా వీరు అవతలి వ్యక్తిని రోడ్డుమీద నడిచే సమయంలో ఢీ కొడతారు. తర్వాత వెనుకకు తిరిగి కౌగలించుకుని పదేపదే సారీ చెప్తారు. అలా సారీ అంటూనే చేతులకు పని చెప్తారు. తర్వాత ఆ వ్యక్తి జేబులో చూసుకుంటే పర్సు కనిపించదు. ఈలోగా గ్యాంగ్ సభ్యుడు కనిపించనంత దూరం వెళ్లిపోతాడు. కరోల్బాగ్, పహాడ్గంజ్, చాందినీచౌక్, సదర్బజార్, కమలానగర్, దరియాగంజ్ ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ చురుకుగా ఉన్నది. కానీ ఎల్లవేళలా వీరి టెక్నిక్ పనిచేయదని ఇటీవలి ఘటనతో తేలిపోయింది. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన దుర్గాకుమార్ అనే వ్యక్తి పహాడ్గంజ్లో ఓ హోటల్ ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కుర్రవాడు ఢీకొట్టి సారీ చెప్పాడు. ఫరవాలేదులే అని దుర్గాకుమార్ అతడిని పంపించివేశాడు. తీరా చూసుకుంటే జేబులోని సెల్ఫోన్ కనిపించలేదు. దాంతో అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుర్రవాని వెంటపడ్డాడు. పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కూపీలాగి మరో ముగ్గురిని పట్టుకున్నారు. 48 గంటల్లో గ్యాంగ్ సభ్యులు ముగ్గురిని ఈ టెక్నిక్ ఉపయోగించి దోచుకున్నారు. వారిలో పంజాబ్కు చెందిన ఓ వ్యాపారి, కేరళకు చెందిన పర్యాటకుడు, తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm