హైదరాబాద్ : పండుగ వేళ సొంతూరికి వచ్చిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన ప్రబుద్ధుడు.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని బారి నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని క్రష్ణగిరి జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మలయాండహళ్లి గ్రామానికి చెందిన యువతి(20) కోయంబత్తూరులో ఓ కంపెనీలో పనిచేస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆమె ఇంటికి వచ్చింది. అయితే ఈ యువతిపై కన్నేసిన వడివళగన్ (22) సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లోనికి చొరబడ్డాడు. అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ ప్రాంతానికి తీసుకెళ్లి తాళికట్టాడు. అయితే అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడు వడివళగన్ ను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm