హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పి.రామ్మోహన్ రావు ఈరోజు తన కుటుంబంతో కలిసి జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ రావుకు కండువా కప్పిన పవన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు గారు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందనీ, జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి జనసేనలో చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm