పూణె: ఛత్రపతి సంభాజీ మహరాజ్ విగ్రహాన్ని కొంతమంది అజ్ఞాతవ్యక్తులు మహారాష్ట్రలోని పూణె పట్టణంలో ఏర్పాటు చేశారు. దీనిని ఏర్పాటు చేసిన ప్రాంతంలో గతంలో ప్రముఖ మరాఠీ నాటకకారుడు రామ్ గణేశ్ గడ్కరీ విగ్రహం ఉండేది. రెండేళ్లక్రితం దీనిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంభాజీ మహరాజ్... మరాఠా యుద్ధవీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కాగా ఛత్రపతి సంభాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అజ్ఞాతవ్యక్తులు అక్కడ ఒక నోటీసును కూడా అతికించారు. ఈ ప్రతిమను తొలగించిన పక్షంలో విపరీత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా డెక్కన్ జిమ్ఖానా పోలీసు అధికారి జాధవ్ మాట్లాడుతూ.. ఆ వివాదాస్పద స్థలంలో ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాం. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm