ఇండోర్: ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి పుల్వామా ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ లోపం వల్లే ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. అందుకే ప్రధాని ఈ అంశంపై మౌనం వహిస్తున్నారన్నారు. అలాగే బాలాకోట్పై వైమానిక దళం చేసిన దాడులపై తాను అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. అంతర్జాతీయ మీడియా లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందని సూచించానన్నారు. దాడి జరగడానికి ఆరు రోజుల ముందే కశ్మీర్ ఐజీ నుంచి సమాచారం ఉందని తెలిపారు. భారీ ఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలతో కాన్వాయ్ను తరలించడంపై ఆయన ముందుగానే హెచ్చరికలు జారీ చేశారన్నారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ లోపంతో 44 మంది జవాన్లు అమరులు కావాల్సి వచ్చిందన్నారు. ఇంటెలిజెన్స్ లోపం అన్న అంశంపై ఇప్పటి వరకు ప్రధానిగానీ, భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్గానీ స్పందించలేదన్నారు. గతంలో బాలాకోట్ దాడిపై దిగ్విజయ్ స్పందిస్తూ..వైమానిక దళ సామర్థ్యాన్ని శంకించడం లేదు కానీ..దాడికి సంబంధించిన చిత్రాలను ప్రజలకు చూపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శాటిలైట్ ద్వారా చిత్రాలను పొందడం పెద్ద కష్టమైన పనేం కాదని వ్యాఖ్యానించారు
Mon Jan 19, 2015 06:51 pm