హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్స్టర్స్ రెచ్చిపోయారు. అక్రమ మద్యం, డ్రగ్స్ వ్యాపారానికి అడ్డువస్తున్నాడనే అక్కసుతో నడి రోడ్డుపై ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న 56 ఏళ్ళ రాజ్ కుమార్ను వెంటాడి హతమార్చారు. ఈ సంఘటనతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి షాదరా జిల్లాలోని వివేక్ విహార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి మేఘనా యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు విజయ్ అలియాస్ భరూరి కస్తూర్బా నగర్కు వాసి. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎస్ఐ రాజ్ కుమార్ డిన్నర్ తరువాత రోజూలాగానే వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ఎస్ఐతో వాదనకు దిగి దుర్భాషలాడారు. దీన్ని వ్యతిరేకించిన ఎస్ఐపై గ్యాంగస్టర్స్ విరుచుకుపడి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఎస్ఐ స్థానిక పోలీస్ స్టేషన్కు పారిపోయాడు. అయినా కూడా ఉపేక్షించని దుండగులు రాజ్ కుమార్ను తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారి పోయారు. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ను ఆసుపత్రి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పోలీసులు విజయ్ గ్యాంగ్పై హత్య కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm