హైదరాబాద్: స్నేహితులంతా ప్రైవేటు పాఠశాలలో చదువుతుంటే తాను మాత్రం ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది. అమ్మానాన్న తన మాటకు విలువివ్వలేదని భావించిన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన నిరుపేద దంపతులు బతుకు తెరువు వెతుక్కుంటూ కొన్నేళ్ల క్రితం తాండూరు వలస వచ్చారు. పట్టణంలోని అద్దె ఇంట్లో ఉంటూ రోజు కూలీ చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు. పెద్ద కొడుకు ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రెండో కొడుకు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం పూట పేపర్లు వేస్తూ కొంత సంపాదించి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. తన స్నేహితుంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరారని, తనను కూడా చేర్చాలని తల్లిదండ్రులను కోరాడు.
అయితే ఆర్థికంగా అంత స్థోమత లేదని వారు నిరాకరించారు. కొడుకు మనస్తాపానికి గురైతే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు ఇంట్లో తల్లి చీరతో ఉరివేసుకుని నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు చర్యతో దిగ్భ్రమకు గురైన తల్లిదండ్రులు మృతదేహాన్ని పట్టుకుని భోరుమన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 19,2019 09:52AM