న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సమావేశానికి నలుగురు కీలక నేతలు డుమ్మా కొట్టనున్నారు. దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశంతోపాటు పలు విషయాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ లు గైర్హాజరు కానున్నారు. టీడీపీ పక్షాన ప్రధాని నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన తరపున టీఆర్ఎస్ ప్రతినిధిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను పంపిస్తుదన్నారు. తాను అఖిల పక్ష సమావేశానికి హాజరు కావటం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. జమిలి ఎన్నికలపై ఇంత తక్కువ నోటీసుతో పెట్టిన సమావేశం సత్ఫలితాలను ఇవ్వదని మమత పేర్కొన్నారు. మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా మోడీ సమావేశానికి దూరంగా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm