హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథాకాన్ని ప్రారంభించారని, మహిళలకు ఉచితంగా స్కూటీలను ఇస్తున్నారని, వెంటనే మీ-సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరగడంతో లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకునేందుకు క్యూ కట్టారు. పదో తరగతి పాసై, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులంటూ, ఆ ప్రకటన వైరల్ కావడంతో, మీ-సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది. ఈ అంశంపై దినపత్రికల్లో సైతం వార్తలు వచ్చాయి. అయితే, అటువంటి పథకమేమీ కేంద్రం ప్రకటించలేదని, ఈ వార్తలు అవాస్తవమని, ఎవరూ స్కూటీల కోసం మీ-సేవకు వెళ్లవద్దని మహిళాశిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను గుర్తించే సంస్థ ఫ్యాక్ట్ లీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారమే ఇదని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm